యువత ప్రాణాల్ని బలి తీసుకుంటున్న యాప్ లోన్లు... ఎలాంటి పూచీకత్తు లేకుండానే సులభంగా రుణాలు.. యువత అవసరాలే ఆసరాగా అధిక వడ్డీ వసూలు.. డబ్బు కట్టాలనే ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు.. ఈ నెలలోనే ముగ్గుర్ని బలి తీసుకున్న నిర్వాహకులు.
అవసరం మనదే అయినా... మనం అడగకుండానే... వాళ్లంతటే వాళ్లే ఫోన్ చేసి... ఎలాంటి ఆధారాలతో పని లేకుండా పది వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తామంటే.. ఎవరికైనా ఆశ కలుగుతుంది. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు తారుమారైన ఈ తరుణంలో... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు అయితే ఇక ఎలాంటి ఆలోచన లేకుండా ఈ యాప్లు ఇచ్చే లోన్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత అధిక వడ్డీలు కట్టలేక అనేక అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ వల్ల సామాన్యుల కుటుంబాల్లో చోటు చేసుకున్నదయనీయ పరిస్థితుల్ని తమకు అనుగుణంగా మలుచుకుంటూ... అనేక మనీ యాప్లు రెచ్చిపోతున్నాయి.
క్రికెట్ బెట్టింగ్కు బానిసై.. యాప్లో రుణం
ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఎంత వేగంగా రుణాలు ఇస్తున్నారో.. అంతే వేగంగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ యాప్ల ఒత్తిడికి ఒక్కనెలలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన శ్రావణ్... ఆన్లైన్ యాప్లో 16 వేలు అప్పుగా తీసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్కు బానిసై భారీగా నగదు పోగొట్టుకున్నాడు. తెలిసిన వాళ్లందరీ దగ్గర అప్పులు చేశాడు. వీటిని తీర్చే క్రమంలో ఆన్లైన్ యాప్ల గాలానికి చిక్కాడు. పూచీకత్తు కూడా లేకుండా రుణాలు ఇవ్వటంతో ఏ మాత్రం ఆలోచించక.. ఆలస్యం చేయక.. లోన్ తీసుకున్నాడు. ఇలా రుణాలిచ్చిన యాప్ నిర్వాహకులు.. అలా వేధింపులు మెుదలుపెట్టారు. లోన్ చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. సకాలంలో డబ్బు కట్టకపోవటంతో లీగల్ నోటీసులు పంపించారు. దాంతో కుటుంబం పరువు పోతుందనే ఆవేదనతో శ్రావణ్ తనువు చాలించాడు.
ప్రాణం తీసుకున్న ఏఈవో
ఆన్లైన్ యాప్ ద్వారా తీసుకున్న అప్పు.. సిద్దిపేట జిల్లా రాజగోపాలపేటకు చెందిన యువతి ప్రాణాలను బలి తీసుకుంది. ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న కిర్ని మౌనిక... తండ్రి వ్యాపారాల్లో నష్టపోవటంతో కుటుంబ అవసరాల కోసం స్నాప్ ఇట్ లోన్ అనే యాప్ నుంచి 3 లక్షల రూపాయలు రుణం తీసుకుంది. గడువులోగా లోన్ డబ్బులు కట్టలేదని.. ఉద్యోగిని ఫోన్లోని నంబర్లన్నింటికీ యాప్ నిర్వాహకులు వాట్సప్లో సందేశం పంపారు. మనస్తాపానికి గురైన బాధితురాలు.. ఈ నెల 14న పురుగుల మందు తాగింది. గాంధీలో చికిత్స పొందుతూ చనిపోయింది.
కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్లందరికీ ఫోన్
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధి కిస్మత్పూర్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్.. నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల కొలువు కోల్పోయా డు. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. యాప్ నిబంధనలు అంగీకరించి.. ఇన్స్టంట్ క్రెడిట్ యాప్ల్లో రుణాలు తీసుకున్నాడు. తిరిగే చెల్లించే క్రమంలో ఇబ్బందులు ఎదురుకాగా.. రుణం చెల్లించలేదని కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్లందరికీ వివరాలు పంపించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. అప్పు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో పరువు పోయిందని భావించిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పర్సనల్ ఫొటోలు ఆన్లైన్లో పెడుతామంటూ బెదిరింపు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన బొగినే రవీందర్ లాక్డౌన్లో ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆన్లైన్ రుణ సంస్థ నుంచి 60 వేలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు 3.8 లక్షలు తిరిగి చెల్లించాడు. అయినా ఇంకా కట్టాలని ఆ సంస్థ ప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు..‘ నీ ఫోన్ హ్యాక్ చేశాం. అందులో నువ్వు నీ భార్య ఉన్న పర్సనల్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెడుతాం అని బెదిరించారు. మనస్తాపంతో రవీందర్ ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్సపొందుతూ ఈ నెల 11న ప్రాణాలు విడిచారు. రవీందర్ మృతితో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు.
ఇచ్చేది 8 వేలు.. వసూలు చేసిది రూ.10,500
దేశవ్యాప్తంగా కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల దాదాపు 41 లక్షల మంది యువత ఉపాధి కోల్పోయారని ఓ అధ్యయనంలో తేలింది. ఇదే సమయంలో ఆన్లైన్లో అప్పు ఇచ్చే యాప్లు, సంస్థలు 3 నెలల కాలంలోనే సగటున 4లక్షల నుంచి 10 లక్షల మంది వినియోగదా రులను చేర్చుకున్నాయి. దీనిని బట్టి పరోక్షంగా ఉపాధిని కోల్పోయినవారు రోజు గడవడం కోసం ఇలాంటి యాప్ల నుంచి అప్పులు తీసుకుంటున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వైఫై క్యాష్, రూపీ ప్లస్, స్నాపిట్ లోన్, ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఇ-క్యాష్ వంటి అనేక లోన్ యాప్లు ఆర్థికంగా అవసరంలో ఉన్న వారికి రుణాలు ఇస్తున్నాయి. ప్రామాణిక విధానమంటూ లేకుండా భారీగా వడ్డీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇదే సమయంలో రుణంగా చేతికి ఇచ్చేది చాలా తక్కువ మెుత్తమే. ఉదాహరణకు ఒక యాప్ లోన్ ఇచ్చే మొత్తం 10,500 రూపాయలు అనుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేరుతో 2,100, జీఎస్టీ పేరుతో 378 రూపాయల వరకూ తగ్గించుకుని కేవలం 8 వేల రూపాయలే చేతికిస్తారు. కానీ వడ్డీ మాత్రం 10,500కి వసూలు చేస్తారు.
ఇతర మార్గాల ద్వారా వసూళ్లు
రుణంగా ఇచ్చే 10,500 లకు 315 రూపాయల వడ్డీ కలుపుకుని మెుత్తం చెల్లించాల్సి ఉంటుంది. వాయిదా కట్టడం ఆలస్యమైతే భారీగా లేట్ ఫీజు వసూలు చేయటంతో పాటు ఇక బాధితుడి పరువు తీసే పనిలో ఉంటారు. అధిక శాతం లోన్ యాప్లు కేవలం ఏడు నుంచి ఇరవై ఒకటి రోజుల పరిమిత గడువుతో 20 వేల లోపు రుణం మంజూరు చేస్తున్నట్లు గుర్తించారు. రుణాన్ని మంజూరు చేసే సమయంలో లోన్ యాప్లు.. తప్పనిసరిగా ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా ఐఎంపీఎస్ సర్వీసు ఉపయోగిస్తూ రుణ గ్రహీతకు అప్పు ఇవ్వాలి. అలాగే రుణాన్ని వసూలు చేసే సమయంలో కూడా ఏదైనా పేమెంట్ గేట్వేని ఉపయోగించాలి. కానీ ఈ యాప్లు దీనికి భిన్నంగా పేటీయం, ఇతర యూపీఐ విధానాల ద్వారా వసూళ్లు చేస్తున్నాయి. వాటికి ప్రామాణికత ఉండదు.
దారుణ ప్రవర్తన
రుణాల్ని తిరిగి రాబట్టుకునే విషయంలో లోన్ యాప్లు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తొలుత సిబిల్ స్కోర్... గణనీయంగా తగ్గేలా చూస్తామని బెదిరిస్తారు. తర్వాత పోలీస్ ఎఫ్ఐఆర్ నకిలీ కాపీలు పంపించి భయపెడతారు. డబ్బులు చెల్లించకపోతే ఇంటికి పోలీసులను పంపిస్తాం అని హెచ్చరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ సీల్తో సర్క్యులర్స్ కూడా పంపిస్తుంటారు. ఇవన్నీ చట్టబద్ధమైన చర్యలు అని నమ్మించటానికి రుణ గ్రహీతకు స్టాంప్ పేపర్ మీద నోటీసులు ఇస్తుంటారు. అలాగే సంబంధిత యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రుణ గ్రహీత ఫోన్ నుంచి సేకరించిన అడ్రస్బుక్లోని అతని బంధువులు, స్నేహితులకి వరసగా వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా సందేశాలు పంపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు సైతం దిగుతున్నారు యాప్ నిర్వాహకులు. దీంతో స్నేహితులు, బంధువులు రుణ గ్రహీతపై ఒత్తిడి తేవటంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు బాధితులు. లోన్ యాప్ల ప్రతినిధులు... మహిళల విషయంలో మరింత అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ యాప్లు చేస్తున్న ఆగడాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ యాప్ రుణాలు