అంతర్జాల మోసాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం జాగ్రత్త పడడం లేదు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆన్లైన్ స్కీంలో డాలర్లలో సొమ్ము పెట్టుబడి పెడితే కొన్ని రెట్లు అధికంగా డబ్బులు వస్తాయని కొందరు చెప్పిన మాటలు నమ్మి యువకులు మోసపోయిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎమ్మిగనూరు పట్టణంలో డాలర్ రూపంలో పెట్టుబడి పెడితే సొమ్ము అధికంగా వస్తుందని నెల్లూరుకు చెందిన విజయ్కుమార్, తాడేపల్లిగూడేనికి చెందిన సాయితేజ, తణుకుకు చెందిన కొర్లపాటి కృష్ణ, తదితరులు గ్లోబల్ కంపెనీ పేరిట నమ్మబలికారు. తమ కంపెనీలో ఆన్లైన్ ద్వారా చేరాలనుకుంటే రూ.8 వేలు కట్టి డాలర్ రూపంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని యువకులకు ఆశ చూపారు. వీరిని నమ్మిన ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీ నగర్కు చెందిన పాండు, అతడి మిత్రులు శ్రీనివాసులు, వీరేష్ ఎంతో ఆశగా అప్పుచేసి కొంత సొమ్మును జమ చేశారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో తొలుత లాభాలను యువకుల ఖాతాకు జమ కావడంతో నమ్మకం పెరిగింది. అనంతరం మరో ఆరుగురు వీరి బాట పట్టారు. వీరంతా ఫోన్పే, గూగూల్పే ద్వారా రూ.29 లక్షలు, పాండు మాత్రం రూ.6 లక్షలు పెట్టుబడులు పెట్టారు. అనంతరం నిర్వాహకుల చరవాణికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. ఏపీ మీసేవ యాప్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి