ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలం 75 తాళ్లూరుకు చెందిన పాలబూత్, హోటల్ నిర్వహకుడు భాష్యం బ్రహ్మయ్య హత్యోదంతం చిక్కుముడి వీడినట్లేనని తెలుస్తోంది. మచిలీపట్నంకు చెందిన ఓ ముఠా సుపారీ తీసుకుని.. బ్రహ్మయ్యను సైనైడ్ చల్లి చంపేసినట్లు ఆనుమానిస్తున్నారు. ఆయనను హతమార్చిన వారిలో కీలక వ్యక్తిని పెదకూరపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వ్యర్థాలను పడేయడానికి వెళ్తుండగా..
ఈనెల 4వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో.. హోటల్ మూసివేసి వ్యర్థాలను గ్రామ శివారులో పడేయటానికి బ్రహ్మయ్య వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. ఆయన వెనుకే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ముఖంపై రసాయనాలు చల్లి దాడికి ప్రయత్నించగా.. బ్రహ్మయ్య వారి నుంచి తప్పించుకుని సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మృతి చెందాడు.
గ్రామానికి చెందిన యువకుని ప్రమేయం..
ఈ హత్య వెనక గ్రామానికి చెందిన యువకుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి మరికొందరు యువకులు సహకరించారని.. వారే సుపారీ గ్యాంగ్తో కలిసి ఈ దారుణానికి తెరతీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరోజున నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనమూ మచిలీపట్నం నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. బ్రహ్మయ్యకు వ్యాపార నిర్వహణలో ఏమైనా ఆధిపత్య పోరు ఉందా? ఆర్థిక వ్యవహారాలు, కుటుంబపరమైన వివాదాలు, వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య.. మృతదేహాలు లభ్యం