గ్యాస్ లీకైన ఘటనలో ఇంట్లో సామగ్రి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు సకాలంలో అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మటన్ వ్యాపారి ఖాదర్ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.1.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
గృహిణి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్పైప్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో మహిళ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. స్థానిక కౌన్సిలర్ నవీన్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.