రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అందరి మన్ననలు పొందిన కట్టా వెంకట నర్సయ్య(87) హైదరాబాద్లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పోచవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆయన ఇంటికి భారీగా ప్రజలు చేరుకున్నారు. కట్టా వెంకట నర్సయ్య భార్య, కొడుకు, కోడలుకు కూడా కరోనా సోకడం విచారకరం.
కట్టా వెంకట నర్సయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వర రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన కట్టా వెంకట నర్సయ్య ఖమ్మంకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు.
మాజీ శాసనసభ్యులు కట్టా వెంకట నర్సయ్య మృతదేహాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబుతోపాటు పలువురు తెరాస, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇతర నాయకులు, ప్రజలు సందర్శించి నివాళులర్పించారు.
ఇదీ చూడండి : జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం: కేటీఆర్