కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండల శివారులో బెల్లం తరలిస్తున్న వాహనాన్ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. 22 క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు.
వాగ్వాదం..
ఈ క్రమంలో ఆబ్కారీ కార్యాలయం వద్ద అధికారులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తాము న్యాయ బద్దంగా వ్యాపారం నిర్వహిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని సదరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం వద్ద వివాదం నెలకొనడం వల్ల పోలీసులు జోక్యం చేసుకుని వ్యాపారులకు పంపించేశారు.
కేసు నమోదు చేశాం..
ఆబ్కారీ సిఐ మహేందర్ సింగ్ను వివరణ కోరగా.. కాగజ్ నగర్ పట్టణం నుంచి పెద్ద మొత్తంలో బెల్లం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీటీఎఫ్ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. పెద్దవాగు సమీపంలో మహీంద్ర ట్రాలీ వాహనాన్ని పట్టుకుని తమకు అప్పజెప్పారని వివరించారు. ఈ మేరకు వాహనంలోని 22 క్వింటాళ్ల బెల్లంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు మనిదీప్పై కేసు నమోదు చేశామని వెల్లడించారు.