అసలును పోలినట్టే నకిలీ ఖాతా..
సైబర్ నేరగాళ్లు ప్రముఖుల ఫేస్బుక్ ఖాతాల్లోని వివరాలను పరిశీలిస్తున్నారు. వారి ప్రొఫైల్ చిత్రంతోపాటు ఖాతాలో ఉన్న ఇతర చిత్రాలను డౌన్లోడ్ చేసుకుంటారు. అందులో పేర్కొన్న వ్యక్తిగత వివరాలు, స్నేహితుల జాబితాలోని వ్యక్తుల పేర్లు సేకరిస్తారు. వాటి ఆధారంగా అవే చిత్రాలు, అవే పేర్లతో అసలును పోలినట్టే ఫేస్బుక్లో నకిలీ ఖాతాను సృష్టిస్తారు. అసలైన ఖాతాలోని స్నేహితుల జాబితాలో ఉన్న వారికి దీని నుంచి ‘ఫ్రెండ్ రిక్వెస్టు’లు పెడతారు. ఆ వినతిని అంగీకరించిన తర్వాత కొన్నాళ్లపాటు ఆ స్నేహితులకు సంబంధించిన పోస్టుల్ని పరిశీలిస్తారు. అనంతరం నెమ్మదిగా తమ పన్నాగాన్ని అమల్లో పెడతారు.
డబ్బుల కోసం మెసెంజర్లో సందేశాలు
ఫేస్బుక్ నకిలీ ఖాతాలో ఉన్న స్నేహితుల మెసెంజర్కు సందేశాలు పంపిస్తారు. హాయ్, హలో అంటూ కుశల ప్రశ్నలు అడుగుతారు. అచ్చం అసలైన వ్యక్తి చాటింగ్ చేసిన తరహాలోనే మాట్లాడుతారు. తనకు అత్యవసరంగా కొంత నగదు అవసరం ఉందని, గూగుల్పే, ఫోన్పే ద్వారా చెల్లించాలని కోరతారు. ఇది నమ్మి తమవారే కదా అడిగిందని కొందరు డబ్బులు బదలాయిస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు అందాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఫోన్ చేసి అడిగినప్పుడు అసలు విషయం బయటపడుతోంది. దాంతో తాము మోసానికి గురయ్యామని తెలుసుకుంటున్నారు.
ఎక్కడి నుంచి వస్తున్నాయంటే..
ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తాల్ని ఒకేసారి అడగకుండా తక్కువ మొత్తాల్లో డబ్బులు కోరుతున్నారు. ఇలా చేయటంవల్ల ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరని.. తద్వారా తాము పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడతో వ్యవహరిస్తున్నారు.
ఫేస్బుక్లోని నకిలీ ఖాతాలను రిపోర్టు చేయండి
ఫేస్బుక్ ఖాతాను ఉపయోగించే వ్యక్తులు తమ స్నేహితుల జాబితాను వారికి మాత్రమే కనబడేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. ప్రొఫైల్ లాక్ చేయటం ఇంకా సురక్షితమైన పద్ధతి. తమ పేరు మీద నకిలీ ఖాతాలు ఏమైనా ఉన్నాయా? అనేది కూడా ‘సెర్చ్’ ఆప్షన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అలాంటి ఖాతాలు ఏవైనా గుర్తిస్తే ‘రిపోర్టు’ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఎంత తెలిసిన వ్యక్తులైనా సరే మెసెంజర్ ద్వారా డబ్బులు అడుగుతున్నారంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ వ్యక్తులకు ఫోన్ చేసి వారేనా? కాదా? నిర్ధారించుకోండి. - రాధిక, ఎస్పీ, సైబర్ నేరాల విభాగం, ఏపీ సీఐడీ
ఇవీ తార్కాణాలు
- ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఏఆర్ విభాగంలో ఆర్ఎస్సైగా పనిచేసే ఓ వ్యక్తికి ఇటీవల తన మిత్రుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘డబ్బు కావాలంటే నేరుగా ఫోన్ చేయొచ్చు కదా.. మెసెంజర్లో ఎందుకు అడిగావ్’ అని ప్రశ్నించడంతో ఆ ఆర్ఎస్సై తానెప్పుడు డబ్బులు అడిగానని ఎదురు ప్రశ్నించారు. అతని మిత్రుడు స్క్రీన్ షాట్లు పంపించడంతో వాటిని చూసి ఇదేదో సైబర్ నేరగాళ్ల పనై ఉంటుందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్లో పనిచేస్తున్న ఓ ఎస్సైకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది.
- తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న సీఐలు రామకృష్ణ, సాయి గిరిధర్, ఎస్సైలు తిమ్మయ్య, సుమతి పేరిట ఇలాగే నకిలీ ఖాతాలు సృష్టించి వారి స్నేహితులకు, పరిచయస్తులకు డబ్బులు పంపించమని అడిగారు.
- తెనాలి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్సై అనిల్ కుమార్ పేరిట నకిలీ ఖాతా సృష్టించి... అతని స్నేహితుల నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం జరిగింది.
- విజయవాడలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న ఇసుకపల్లి బాల గురుప్రసాద్రెడ్డి మెసెంజర్కు.. జయన్న అనే ఎస్సై పేరిట ఉన్న ఖాతా నుంచి సందేశం వచ్చింది. తనకు అత్యవసరంగా రూ.లక్ష కావాలంటూ అందులో కోరటంతో... తనకు బాగా తెలిసిన వ్యక్తే కదా! అని బాలగురుప్రసాద్రెడ్డి అతను చెప్పిన బ్యాంకు ఖాతాకు రెండు విడతల్లో ఆ డబ్బులు పంపించారు. కొద్దిసేపటి తర్వాత డబ్బులు అందాయా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఫోన్ చేసినప్పుడు సైబర్ మోసం వెలుగుచూసింది.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి 'జన్ ఆందోళన్' ప్రారంభించనున్న మోదీ