సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో మల్లన్న సాగర్ ముంపు బాధితుడు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావడం లేదంటూ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. అతని ఒంటిపై నీళ్లు పోసి రక్షించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అసలేం జరిగింది
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సింగారం గ్రామానికి చెందిన మహమ్మద్ అజీజ్ పాషాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. మల్లన్న సాగర్ జలాశయంతో ఆ భూమి ముంపునకు గురైంది. ముంపు పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది.. కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా అందాల్సిన పరిహారం తనకు ఇంకా ఇవ్వలేదని మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ.. కార్యాలయానికి వెళ్లి ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించాడు. అధికారులు రేపు మాపు అంటూ పరిహారం ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయాడు.
ఆర్డీఓ ఫిర్యాదు
ఈ ఘటనపై గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి స్పందించారు. మహమ్మద్ పాషాకు భూ పరిహారాన్ని గతంలోనే అందజేశామని ఆర్డీఓ చెప్పారు. పాషా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హుడు కానందువల్ల తాము ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అతనికి చెప్పినప్పటికీ తమను బెదిరించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వివరించారు. ఈ విషయమై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: డీసీఎం కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. యువకుడు మృతి