భారత్లో 14 రోజులకు పైగా ఉండి వచ్చే ప్రయాణికులకు వీసా అన్ అరైవల్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడి అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది.
'అమెరికా వీసా కలిగి ఉన్న భారతీయ పౌరుడు అబుదాబికి వెళ్లి... వీసా ఆన్ అరైవల్, క్వారంటైన్ లేకుండా దుబాయ్ వెళ్లవచ్చా?' అని ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్కు సమాధానంగా ఎతిహాద్ ఎయిర్వేస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే నిబంధన అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల పౌరులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ప్రయాణికులకు టీకా తప్పనిసరి..
తమ దేశానికి వచ్చి, పోయే విమాన ప్రయాణికులందరూ.. తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని పాకిస్థాన్ స్పష్టం చేసింది. దేశంలో నాలుగోదశ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్(ఎన్సీఓసీ) ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయిలో టీకా తీసుకున్న వారిని మాత్రమే దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతిస్తామని.. అంతర్జాతీయ ప్రయాణాలకు సెప్టెంబర్ 30 చివరి తేదీ అని స్పష్టం చేసింది.
ఇరాన్లో రికార్డు స్థాయిలో మరణాలు...
ఇరాన్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు వెలుగు చూశాయి. ఒక్కరోజులోనే 709 మంది చనిపోయారు. మరో 7,727 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మరో 40,600 మంది కరోనా బారిన పడినట్లు అక్కడి ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: చింపాంజితో మహిళ అఫైర్.. 'జూ' అధికారులు ఏం చేశారంటే?