ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుర్రపు పందేలకు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వారంలో జరగనున్న పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి మొత్తం 20 మిలయన్ల డాలర్ల నగదు బహుమతులను అందించనున్నారు. విజేతకు 10 మిలియన్ డాలర్లు, రెండో బహుమతి కింద 3.5 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నారు. పదో స్థానంలో నిలిచిన వారికి కూడా ఎంతో కొంత నగదను అందజేయనున్నారు.
1,800 మీటర్ల పందెం..
సౌదీ కప్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు సుమారు 10 వేల మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. ఈనెల 29న కింగ్ అబ్దుల్ అజీజ్ రేస్ ట్రాక్ వద్ద 1,800 మీటర్ల మేర పందేలు జరగనున్నాయి. సౌదీ కప్ ఆధ్వర్యంలోనే మరో ఏడు రేసులు నిర్వహించనున్నారు. అందులో 9.2 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు.
"దేశీయ గుర్రపు పందెం పోటీలను అంతర్జాతీయ ప్రత్యర్థులతో సమానంగా తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు మొదటి అడుగు వేశాం. సౌదీ అరేబియాలో క్రీడల ప్రాముఖ్యాన్ని పెంచేందుకు, పందెంలో దేశ ప్రత్యేకతను చాటుకోవడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. "
-టామ్ ర్యాన్, జాకీ క్లబ్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ రేసింగ్ డైరెక్టర్
ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రపు పందేలుగా చెప్పుకునే యూఎస్ పెగసావ్ ప్రపంచ కప్, దుబాయ్ ప్రపంచకప్లు ఒక నెల వ్యత్యాసంలో జరిగాయి. పెగసాస్ ప్రపంచ కప్లో 16 మిలియన్ డాలర్లు, దుబయ్ ప్రపంచ కప్లో 12 మిలియన్ డాలర్లను బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డ్ను సౌదీ కప్ పోటీలు అధిగమించనున్నాయి.
రేసులో పేరున్న జాకీలు..
సౌదీ కప్లో పేరున్న పెద్ద జాకీలు పాల్గొంటున్నారు. ఇటాలియన్ లెజెండ్ ఫ్రాంకీ డెటోరి, బ్రిటన్కు చెందిన ర్యాన్ మూర్. సౌదీ అరేబియాలో తొలి మహిళా జాకీగా పేరుగాంచిన నికోలా క్యూరీ పోటీలో స్వారీ చేయనున్నారు.
ఇదీ చదవండి: కరోనా: చైనాలో 2,715కు చేరిన మృతుల సంఖ్య