Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దృష్ట్యా మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ దేశ ప్రధానికి తమ రాజీనామా పత్రాలను మంత్రులు అందించారు. సంక్షోభం నేపథ్యంలో మార్చి 31 నుంచి ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించాడు అధ్యక్షుడు రాజపక్స.
దేశంలో సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స రాజీనామా చేసినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు తన రాజీనామాను అందించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలను కొట్టిపారేసింది ప్రధానమంత్రి కార్యాలయం. మహీంద రాజపక్స రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. అవి తప్పుడు వార్తలుగా పేర్కొంది. రాజీనామాపై వస్తున్న వార్తలను ప్రధాని మహిందా రాజపక్స మీడియా సెక్రటరీ తిరస్కరించారు. కానీ, ప్రస్తుతం ఈ కీలక పరిణామాలు జరిగాయి.
Sri Lanka protests: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.
ఇదీ చదవండి: శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా?