Cyber Fraud With Fake Mail Ids : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త రకమైన మోసాలకు పాల్పడుతూ కోట్లు కాజేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఈ -మెయిల్లో ఒకే ఒక్క అక్షరం మార్చేసి సంస్థ నుంచి రూ.5.47 కోట్లను స్వాహా చేశారు. బాలానగర్లోని సంస్థ ఎకౌంట్స్ మేనేజర్ దుంపల శ్రీహరి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు.
వివరాలు : 2022 మే 10న మేఘా కంపెనీ సంస్థకు అవసరమైన సామగ్రి కోసం నెదర్లాండ్స్లోని ఓ సంస్థకు 14.39 లక్షల యూరోల విలువైన కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది. అదే నెల 17న 7.95 లక్షల యూరోల విలువైన మరో ఆర్డర్ ఇచ్చింది. అనంతరం ఒప్పందం ప్రకారం మేఘా కంపెనీ ఆ సంస్థకు ఆన్లైన్లో చెల్లింపులు చేస్తూ పోయింది. అలా చెల్లింపులు చేసిన ప్రతిసారి ఆ సంస్థ ప్రతినిధి నుంచి మేఘాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది.
పాత ఖాతాపై ఆంక్షలున్నాయంటూ మోసం : ఈ క్రమంలో 2024 నవంబరు 29న నెదర్లాండ్స్లోని సంస్థ పేరిట మేఘా కంపెనీకి ఒక మెయిల్ వచ్చింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా తమ బ్యాంకు పాత ఖాతాపై ఆంక్షలున్నాయని ఇక నుంచి కొత్త ఖాతాకు సొమ్ము బదిలీ చేయాలనేది ఆ మెయిల్ సారాంశం. ఇక్కడే సైబర్ నేరస్థులు తమ పథకాన్ని అమలు చేశారు. ఒకే అక్షరం తేడాతో ఆ సంస్థ మెయిల్ను పోలి ఉన్న మరో నకిలీ మెయిల్ను ఆ సంస్థకు పంపించారు.
నకిలీ ఖాతాకి సొమ్ము : అందులో బ్యాంకు కొత్త ఖాతా(నకిలీ) నంబర్ను ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 24న మేఘా సంస్థ రాజ్భవన్ బ్రాంచ్ యూబీఐ ఖాతా నుంచి 3.18 లక్షల యూరోల సొమ్మును నకిలీ ఖాతాకి పంపించారు. అదే నెల 27న కన్ఫర్మేషన్ మెయిల్ సైతం వచ్చింది. దీంతో అదే నెల 29న మరో 2.89 లక్షల యూరోలను బదిలీ చేశారు. అయితే చివరి రెండు చెల్లింపుల కోసం నెదర్లాండ్స్లోని సంస్థ నుంచి మెయిల్ రావడంతో మేఘా కంపెనీ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. నకిలీ మెయిల్ పంపించి సైబర్ నేరస్థులు బురిడీ కొట్టించారని గ్రహించారు. అలా పోగొట్టుకున్న మొత్తం భారతీయ కరెన్సీలో రూ.5.47 కోట్లని పేర్కొంటూ టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు.
ఒక్క అక్షరం మార్చి - రూ.10 కోట్లు కాజేశారు
100 మందే 10వేల నేరాలు చేశారు - తెలంగాణ పోలీసులు ఎలా చెక్ పెడుతున్నారంటే!