Biden G20 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షెడ్యూల్ ప్రకారం భారత్కు రానున్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు కరోనా నిర్ధరణ కాగా.. జో బైడెన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. దీంతో అమెరికా ఈ మేరకు స్పష్టతనిచ్చింది. సోమ, మంగళవారం చేసిన కొవిడ్ పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడికి నెగిటివ్ వచ్చిందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తెలిపారు. ఇక బైడెన్ గురువారం.. దిల్లీ బయలుదేరుతారని, శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని వెల్లడించారు. . కొవిడ్ 19 మార్గదర్శకాలను అనుసరిస్తూ.. ఆయన ఈ సమావేశాలకు హాజరవుతారని వైట్హౌస్ తెలిపింది.
అనంతరం ఈనెల 9, 10వ తేదీల్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో బైడెన్ పాల్గొంటారని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని చెప్పారు. జీ-20 పట్ల అమెరికా నిబద్ధత ఏ మాత్రం తగ్గలేదన్న ఆయన, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు.. సవాలులో కూడా కలిసి పనిచేయగలవన్న నమ్మకాన్ని ఈ సమావేశం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జీ 20 సమావేశాల తర్వాత బైడెన్ వియత్నాం పర్యటనకు వెళ్లనున్నారు.
Jil Biden Tests Coronavirus Positive : అంతకుముందు.. మంగళవారం అమెరికా అధ్యక్షుడి సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కరోనా బారినపడ్డారు. వీరిద్దరూ గత శనివారం ఫ్లోరిడాలోని హరికేన్ ఐడాలియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత డెలావెర్లోని బీచ్ హౌస్కు వెళ్లారు. అక్కడి నుంచి బైడెన్.. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వైట్హౌస్కు చేరుకున్నారు. అయితే జిల్ బైడెన్ అక్కడే ఉండిపోయారు. డెలావెర్లో ఉన్నప్పుడే ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆమె డెలావెర్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైట్హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
G20 Delhi Security : అయితే దేశ రాజధాని దిల్లీలో శని, ఆదివారల్లో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో రాజధాని నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. అధికారులు దిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. రక్షణ నిమిత్తం భద్రతా బలగాలతో పాటు సరికొత్త సాంకేతికతలను మోహరించారు.
క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ.. చైనా అసహనం
Jinping G20 Summit 2023 : G20కి జిన్పింగ్ డుమ్మా.. త్వరలోనే చైనాకు బైడెన్!.. ఏం జరుగుతుంది?