గుండె జబ్బులను వేగంగా గుర్తించడానికి బ్రిటన్ ఆరోగ్య సేవా (ఎన్హెచ్ఎస్) విభాగం ఒక విప్లవాత్మక పరిజ్ఞానాన్ని ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనికింద హృద్రోగమున్నట్లు భావిస్తున్న వారిని పరీక్షించి, వారిలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించనుంది. సాధారణ ప్రక్రియలతో పోలిస్తే ఇది ఐదు రెట్లు వేగంగా సాగుతుంది. 'హార్ట్ ఫ్లో' అనే ఈ పరిజ్ఞానం.. గుండెకు సంబంధించిన సాధారణ సీటీ స్కాన్ను ఒక త్రీడీ చిత్రంగా మారుస్తుంది. దీనివల్ల హృద్రోగాన్ని 20 నిమిషాల్లోనే వైద్యులు గుర్తించగలుగుతారు.
ఇప్పటివరకు ఉన్న విధానంలో.. రోగి ఆస్పత్రికి వెళ్లి యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. దీనికి సమయం పట్టడం సహా శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. పక్షవాతం, గుండె జబ్బులను తగ్గించడానికి ఉద్దేశించిన దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎన్హెచ్ఎస్ మెడికల్ డైరెక్టర్ సీఫెన్ పొవిస్ చెప్పారు. ఈ రుగ్మతలను వేగంగా గుర్తించి, చికిత్స చేయడం వల్ల వేల మంది ప్రాణాలు నిలుస్తాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా వైద్య సేవల్లో ఏర్పడ్డ ఆటంకాన్ని అధిగమించడానికి మార్గం సుగమమవుంతదని చెప్పారు.
ఇదీ చదవండి : లండన్లో జైశంకర్ వరుస సమావేశాలు