ఇరాన్లో రెండో శక్తిమంతమైన నేత ఖాసిం సులేమానీని అమెరికా సేనలు మట్టుబెట్టడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాక్, ఇరాన్కు సంబంధించిన ప్రయాణాలను రద్దు చేసుకోవాలని బ్రిటన్ పౌరులకు సూచించింది ఆ దేశ ప్రభుత్వం.
ఈ మేరకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది ఆ దేశ విదేశాంగ కార్యాలయం.
"టాప్ కమాండర్ సులేమానీ మరణానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనుక బ్రిటన్ పౌరులు ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంతం మినహా ఇరాన్, ఇరాక్లోని ఇతర ప్రాంతాల ప్రయాణాలను రద్దు చేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు మీడియాలో అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్త వహించండి. బ్రిటన్ పౌరులను సురక్షితంగా ఉంచడమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం."
-బ్రిటన్ ప్రభుత్వ ప్రకటన
శుక్రవారం బాగ్దాద్ విమానాశ్రయంలో సులేమానీపై అగ్రరాజ్యం వైమానిక దాడులు చేసి హతమార్చడం వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.
ఇదీ చూడండి: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ప్రమాదం అంచున ప్రపంచం