కరోనా కారణంగా ఇటలీ రోమ్లో సినిమా హాల్స్ మూతపడ్డాయి. దీంతో కొవిడ్ సంక్షోభంలో పూట గడిచేందుకు రంగస్థల ప్రదర్శనలు ప్రారంభించారు కళాకారులు. ప్రేక్షకులు బుక్ చేసుకుంటే కళాకారులు స్కూటర్, సైకిల్పై వాళ్లు కోరుకున్న చోటుకే వచ్చి రంగస్థల ప్రదర్శనలు చేస్తున్నారు. ఓ ప్రదర్శనల మెనూను రూపొందించి.. ప్రేక్షకులు ఏది కోరుకుంటే ఆ ఆటను ప్రదర్శిస్తున్నారు.
" థియేటర్ డెలివరీ విధానం విజయవంతం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ విధానం వల్ల కథలు చెప్పడం నేను కొనసాగిస్తాను. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇలాంటి ప్రదర్శనలు చేయటం ఎంతో ముఖ్యం. నేను దీన్ని ప్రజాసేవగా భావిస్తున్నాను. థియేటర్ డెలివరీ విధానం.. పిజ్జా డెలివరీ విధానం లానే ఉంటుంది.. కానీ ఇక్కడ ఆహారం కాకుండా.. ఆత్మ సంతృప్తి లభిస్తుంది. కరోనాతో చాలా కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు.. థియేటర్ డెలివరీ విధానం ద్వారా మానసిక సంతృప్తిని అందిస్తున్నాం."
--మిచెల్ సెసారెట్టి సల్వీ, రంగస్థల కళాకారిణి
బుక్ చేసుకుంటే..
మిగతా కళాకారులలానే కళాకారిణి సల్వీ సైతం.. రోడ్డు పక్కన, పార్కుల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. ఓ బ్యాగు, మైక్, ఇతర స్టేజ్ సామగ్రితో ప్రేక్షకులు కోరుకున్న చోట ఆమె వాలిపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడేలా ఓ ప్రదర్శన మెనూను రూపొందించి.. ఏ ప్రదర్శన కావాలి? ఎక్కడ ప్రదర్శించాలి? అని.. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. అక్కడకు వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ విధానాన్ని కొంతమంది సమాజ సేవగా అభివర్ణిస్తున్నారు.
" థియేటర్ డెలివరీ.. ఒక అద్భుతమైన విధానం. ఈ విధానంతో ప్రజల వద్దకే థియేటర్ వస్తుంది. ప్రేక్షకులు ఇండోర్ థియేటర్స్కు వెళ్లాల్సిన అవసరం లేదు."
-- లూకా స్కార్జోన్, విద్యార్థి
ఒక ఐడియా..
కళాకారిణి ఇప్పోలిటో చియారెల్లోకు వచ్చిన ఆలోచనను.. మిగతా కళాకారులు కలిసి అభివృద్ధి చేశారు. ఓ గ్రూప్ను ఏర్పాటు చేసి ఇటలీ వ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు. కొవిడ్-19 కారణంగా వినోద రంగం తీవ్రంగా దెబ్బతింది. మ్యూజియంలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా.. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో మాత్రం స్పష్టత లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటలీలోని ఓ పత్రిక కథనం ప్రకారం.. కరోనా ప్రబలినప్పటి నుంచి వినోద రంగం స్తంభించింది. 69 శాతం కార్యక్రమాలను నిలిపివేశారు. కళాకారులు 72 శాతం ఆదాయాన్ని కోల్పోయారు.
ఇదీ చదవండి : అరుదైన బటన్లతో మ్యూజియం.. ఎక్కడంటే?