కరోనా మహమ్మారిని నివారించటం లేదా చికిత్స అందించటానికి విటమిన్-డీ ప్రయోజనకరంగా ఉంటోందనడానికి ప్రస్తుతం సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని ఓ అధ్యయనం వెల్లడించింది. రోగులకు అధిక మోతాదులో విటమిన్-డీ ఇవ్వడం ద్వారా ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
కొవిడ్-19 సంక్రమించకుండా డీ-విటమిన్ అడ్డుకుంటుందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంటువ్యాధుల చికిత్సలో విటమిన్ల వినియోగంపై ప్రస్తుత శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించారు. ఈ అధ్యయనం జర్నల్ బీఎంజే (పోషణ, నివారణ, ఆరోగ్యం)లో ప్రచురితమైంది.
" విటమిన్-డీపై మరింత బలమైన శాస్త్రీయ ఆధారాలు లభించే వరకు అధిక మోతాదులో వినియోగించకూడదని హెచ్చరిస్తున్నాం. విటమిన్ –డీ అనేది ఒక హార్మోన్. సూర్యరశ్మి పడినప్పుడు చర్మంలో ఉత్పత్తి అవుతుంది. శరీరంలో కాల్షియం, పాస్ఫేట్ల స్థాయిలను నియంత్రిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి శరీరంలో సరిపడా విటమిన్ డీ ఉండాలి. తక్కువగా ఉంటే అది రికెట్స్ లేదా ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అలాగే అవసరానికి మించి ఉంటే.. రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగి హాని చేకూరుస్తుంది. కరోనాను నివారించడానికి లేదా చికిత్స చేయటానికి డీ విటమిన్ అధిక మోతాదులో ఇవ్వటానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు."
– లాన్హామ్ న్యూ, అధ్యయనం ప్రధాన రచయిత.
విటమిన్ డీ స్థాయిలు, శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధంపై గత అధ్యయనాలను పరిశీలించారు పరిశోధకులు. విటమిన్ డీ తక్కువగా ఉండటం వల్ల తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తున్నట్లు కనుగొన్నారు. కానీ, శ్వాసకోశ వ్యాధులను అడ్డుకుంటున్నట్లు ఎలాంటి అధారాలు లేవని పేర్కొన్నారు.
పోషక సమతుల్య ఆహారంతో..
చేపలు, మాంసం, గుడ్డు పచ్చసొన వంటి పోషక సమతుల్య ఆహారం తీసుకోవటం ద్వారా శరీరానికి సరిపడా విటమిన్–డీని పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తృణధాన్యాలు, సూర్యకాంతిలో పెరిగే బలవర్ధకమైన ఆహార పదార్థాలతోనూ విటమిన్-డీ స్థాయిలు పెరుగుతాయని చెప్పారు.