స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమవేశం సందర్భంగా వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు.
స్థానికంగా ఉన్న ఓ సరస్సు ఒడ్డున ఉన్న విల్లాలో ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత బైడెన్, పుతిన్ భేటీ అవుతున్నారు. అంతకుముందు వీరిద్దరూ కలిసిన సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా, పుతిన్ ప్రధానిగా కొనసాగుతున్నారు.
![Biden and Putin meet, Biden and Putin in summit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12154943_meet.jpg)
దేనిపై చర్చలు?
అమెరికాపై ఇటీవల జరిగిన సైబర్ దాడులపై బైడెన్ ప్రస్తావించే అవకాశం ఉంది. దీనితో పాటు వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి మొదలైన అంశాలపైన చర్చించనున్నారు. వివాదాస్పద అంశాలైన ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సహా అఫ్గానిస్థాన్, లిబియా, ఉక్రేయిన్, సిరియా దేశ పరిస్థితులపై కూడా ఇరు దేశాల అధ్యక్షులు చర్చించనున్నారు.
అంతకుముందు.. ఈ భేటీపై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల బంధాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ చర్చల నుంచి మెరుగైన ఫలితాలు ఆశించలేమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : బైడెన్కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్!