అమెరికన్ శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్లు(nobel prize 2021 medicine).. వైద్య విభాగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు(nobel prize medicine 2021). ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి థామస్ పెర్ల్మన్ ఓ ప్రకటన చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో డేవిడ్ జూలియస్ ఆచార్యునిగా పనిచేస్తుండగా.. ఆర్డెమ్ పటాపౌటియన్ కాలిఫోర్నియాలోని స్క్రిస్స్ రీసెర్చ్ కేంద్రంలో ఆచార్యునిగా విధులు నిర్వహిస్తున్నారు.

భౌతిక స్పర్శలను మనిషి శరీరంలోని నాడీవ్యవస్థ.. విద్యుత్ సందేశాలుగా ఎలా మార్చుతుందనే రహస్యాన్ని వీరు తమ పరిశోధన ద్వారా ఛేదించారు. ఈ ఫలితాలు.. భవిష్యత్తులో నొప్పికి సంబంధించిన చికిత్సల తీరును మార్చేసే అవకాశం ఉంది. మనిషి మిరపకాలు, మిరియాలు తిన్నప్పుడు నొప్పితో కూడిన మంటను ఎందుకు అనుభవిస్తాడో.. డేవిడ్ జూలియస్(david julius nobel prize) తేల్చారు. మిరపకాయలో వేడిని పుట్టించే కాప్సాయిసిన్ అనే క్రియాశీల రసాయనంతో ఆయన ప్రయోగాలు నిర్వహించారు. మనిషి శరీరంలో కాప్సాయిసిన్ అనే పదార్థానికి స్పందించే ప్రత్యేక రకం కణ భాగాన్ని కనుగొన్నారు. దానిపై మరిన్ని పరిశోధనలు చేసిన తర్వాత స్పందించే కణజాలంలోని పదార్థమే.. వేడికి, నొప్పికి కారకమైన ఉష్ణోగ్రతలకు కూడా స్పందిస్తుందని వెల్లడైంది.
ఉదాహరణకు వేడి కాఫీ మీదపడి చేయి కాలితే, ఆ ఉష్ణోగ్రతకు స్పందించి నొప్పి కలిగించేది ఆ ప్రత్యేక పదార్థమే. ఈ పరిశోధన ఫలితాలు ఉష్ణోగ్రతలకు స్పందించే ఇతర కణభాగాలను గుర్తించేందుకు బాటలు వేశాయి. జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్ కలిసి చలిని గుర్తించే కణపదార్థాలను కనుగొన్నారు. వాటినే రిసెప్టర్లు అంటారు. మనిషి మనుగడకు చాలా కీలకమైనందున.. ఇది చాలా ముఖ్యమైన, లోతైన ఆవిష్కరణగా నోబెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి థామస్ పెర్లమన్ అభివర్ణించారు. గతేడాది న్యూరో సైన్స్ విభాగంలో ప్రతిష్టాత్మకంగా భావించే.. కావ్లీ అవార్డుకు కూడా వీరిద్దరూ ఎంపికయ్యారు.
నోబెల్ అవార్డ్ కింద బంగారు పతకం, 11 లక్షల డాలర్లు నగదు పురస్కారం అందజేస్తారు. ఆ మొత్తాన్ని ఇద్దరికీ సమానంగా పంచుతారు. వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రాలు వంటి ఆరు విభాగాల్లో అందించే నోబెల్ పురస్కారాల్లో ఇది మొదటిది.