ఇటలీ.. అందమైన దేశం. నిత్యం పర్యటకులతో కళకళలాడుతుంది. సందర్శకులు, స్థానికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే రెండు రోజులుగా పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది.
ఫాంబియో సహా కొన్ని పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపై ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఎప్పుడూ జనాలతో నిండుగా కనిపించే ఈ నగరాలకు ఏమైంది? అసలేం జరిగింది? ఇక్కడ నివసించే ప్రజలు ఏమయ్యారు.
ఇటలీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు.. తీవ్రత అధికంగా ఉన్న ఉత్తర ఇటలీలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. దీంతో రెండు రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఆంక్షల నేపథ్యంలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రహదారులపై కనిపించడం లేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. 2,300 మంది ఉన్న ఫాంబియో పట్టణంలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు.
ప్రభుత్వ ఆంక్షలను అమలు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు ఉత్తర ఇటలీ అధికారులు.
ఇదీ చూడండి: కరోనా: చైనాలో 2,715కు చేరిన మృతుల సంఖ్య