భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి.. తన వింత ప్రవర్తనతో అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. భార్యతో గొడవ అనంతరం తనను తాను శాంతింపజేసుకునేందుకు ఏకంగా 280 మైళ్లు పాదయాత్ర చేశాడు. చివరకు ఓ బీచ్లో పోలీసుల కంటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటలీలోని కోమోకి చెందిన ఓ వ్యక్తి కి ఇటీవల భార్యతో గొడవైంది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. కోపంలో అలా నడుస్తూ రోజుకు 40 మైళ్ల చొప్పున వారం రోజుల పాటు ఏకంగా 280 మైళ్లు నడిచేశాడు. చివరకు అడ్రియాటిక్ కోస్టల్ ప్రాంతంలో ఫానో అనే ఓ బీచ్కు చేరుకున్నాడు. ఇటలీలో ప్రస్తుతం కొవిడ్ కారణంగా లాక్డౌన్ ఆంక్షలు ఉండటంతో రాత్రి వేళ బయట తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు అతడిని ప్రశ్నించారు. భార్యతో గొడవ పడి 280మైళ్లు పాదయాత్ర చేశానని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన అతడికి పోలీసులు 485 డాలర్లు జరిమానా విధించారు. కాలినడకన అంత సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ ఆ వ్యక్తి తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపాడు. తనకు పాదయాత్రలో కొందరు ఆహారం, తాగునీరు అందించారని చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి : 'కరోనాను ఎదుర్కొనే సమర్థత ఫైజర్కు ఉంది'