కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కండోమ్ల కొరత తీవ్రం కానుంది. కర్మాగారాలు మూతపడటం, సరఫరా వ్యవస్థ నిలిచిపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం కాని వ్యాపారాలపై ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో కండోమ్ ఉత్పత్తి భారీగా పడిపోయింది.
లాక్డౌన్ కారణంగా..
మలేసియా.. రబ్బరు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. కండోమ్ ఉత్పత్తి దేశాల్లో ప్రధానమైనది. అయితే ఈ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత నెలలో వంద శాతం లాక్డౌన్ అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఐదు కండోమ్లలో ఒకటి మలేసియాలోని కారెక్స్ సంస్థలోనే తయారవుతుంది. ప్రపంచంలోని చాలా కంపెనీలు, ప్రభుత్వాలకు కండోమ్ సరఫరా చేస్తుంది. లాక్డౌన్ వల్ల మలేసియాలోని కారెక్స్ సంస్థకు చెందిన 3 ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
అనేక ఇబ్బందులు..
ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక 50 శాతం ఉద్యోగులతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది కారెక్స్. కానీ... మానవ వనరుల కొరతతో ఉత్పత్తిని 20 కోట్ల యూనిట్ల మేర తగ్గించింది. రవాణా సమస్యలతో మార్కెట్లోకి కండోమ్ సరఫరా కష్టమవుతోందని కారెక్స్ సీఈఓ గోమియా కియత్ తెలిపారు.
"ప్రపంచం కచ్చితంగా కండోమ్ కొరతను ఎదుర్కొంటోంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే కండోమ్ అత్యవసరమైనది. మనం కరోనాతో పోరాడుతున్నాం. కానీ కొరతను తగ్గించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం."
- గోమియా కియత్, కారెక్స్ సీఈఓ
ఐరాస ఆందోళన..
ఐక్య రాజ్య సమితి కూడా కండోమ్ కొరతకు సంబంధించి హెచ్చరికలు చేసింది. వైరస్ కారణంగా దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ వల్ల 50 నుంచి 60 శాతం మాత్రమే కండోమ్లు లభిస్తున్నాయని తెలిపింది.
"సరిహద్దుల మూసివేత, ఇతర ఆంక్షల కారణంగా చాలా దేశాల్లో రవాణా, ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ అత్యవసర వస్తువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలి. లేదంటే.. అవాంఛిత గర్భాలు పెరిగిపోతాయి. కౌమార దశలో ఉన్నవారిపై ఇది ప్రభావం చూపిస్తుంది. కుటుంబాలు, భాగస్వాములతో సామాజిక ఇబ్బందులు ఎదురవుతాయి."
- అధికార ప్రతినిధి, ఐరాస జనాభా నిధి
ఈ సమస్యలే కాకుండా సురక్షితం కాని గర్భవిచ్ఛిత్తి కేసులు పెరుగుతాయని.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమూ ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్పత్తి పెంచేందుకు..
లాక్డౌన్ కారణంగా కండోమ్, గర్భ నిరోధక మాత్రల వినియోగం పెరుగుతోందని పలు నివేదికలు వెల్లడించాయి. కొరత ఉన్నప్పటికీ డిమాండ్ పెరుగుతున్న కారణంగా పలు సంస్థలు ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
చైనాలోని హెచ్బీఎం ప్రొటెక్షన్స్.. ఏడాదికి 100 కోట్ల కండోమ్లను ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న కారణంగా ఈ ఉత్పాదకతను 3 రెట్లు పెంచాలని నిర్ణయించింది. షాంఘైలోని మింగ్ బ్యాంగ్ రబ్బర్ ప్రొడక్ట్స్ కూడా ఉత్పత్తిని భారీగా పెంచి సరఫరా చేయాలని భావిస్తోంది.
ఇదీ చూడండి: ఎంపీల జీతాల్లో కోత అమలుకు ఆర్డినెన్స్