చతుర్భుజ కూటమి(క్వాడ్) ఈ నెల 12న భేటీ కానుంది. వర్చువల్గా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తొలిసారిగా క్వాడ్ సభ్యదేశాల అధినేతలు పాల్గొననున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక జో బైడెన్, ప్రధాని మోదీ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి కానుంది.
చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ సహకారాన్ని విస్తరించే దిశగా చర్చలు జరిగే అవకాశముందని విదేశాంగ శాఖ తెలిపింది. వీటితో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సరఫరా గొలుసు, సాంకేతికత, సముద్ర భద్రతపై మాట్లాడే అవకాశముందని వెల్లడించింది.
వాతావరణ మార్పులపై..
ప్రపంచ మహమ్మారి కొవిడ్ను ఎదుర్కోవడం సహా ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పులపై చర్చించనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఆయన పాల్గొనబోయే బహుముఖ కూటమి సదస్సు ఇదేనని పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని అమెరికా ఉద్ఘాటించింది.
ఇదీ చదవండి : 'కొవిడ్ టీకాతో.. ప్రపంచాన్ని రక్షించిన భారత్'