ఓ వ్యవస్థీకృత విధానంలో పాకిస్థాన్ను భ్రష్టు పట్టిస్తోంది తమ దేశ ప్రభుత్వాలే అని పాకిస్థాన్ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి పంజాబ్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాన్ని 2019లో రద్దుచేసిన ఘటనపై ఈ వ్యాఖ్యలు చేసింది. అక్కడ స్థానిక ఎన్నికల కోసం 18వందల కోట్లు ఖర్చుకాగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని కూల్చారని పాకిస్థాన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఖాజీ ఫీజ్ఇసా మండిపడ్డారు. ఆ స్థాయిలో ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఇమ్రాన్ సర్కార్ను ప్రశ్నించారు.
దేశంలోని పాత్రికేయులపై ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు జస్టిస్ ఖాజి. అసలు పాకిస్థాన్లోని పాత్రికేయులకు భావప్రకటన స్వేచ్ఛ ఉందా అని నిలదీశారు. నిజం చెప్పాలనుకున్న వాళ్లపై దాడులకు దిగి దేశం వెలుపలకు వెళ్లగొడుతున్నారని పాకిస్తాన్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పాకిస్తాన్లో ఇదే తరహాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటూ వెళ్తే... సగం దేశం ఖాళీ అవుతుందని కోర్టు హెచ్చరించింది.