కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
''కరోనా వైరస్ రెండో దశపై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. పొరుగుదేశం సహా ఇతర అన్ని దేశాలు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాలుపై కలసికట్టుగా యుద్ధం చేయాలి''
- ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
భారత్లో కరోనా వైరస్ రెండోదశ కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది మంది కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 1,89,544 మంది ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల అధినేతలు భారత్ పట్ల సంఘీభావం ప్రకటించారు. భారత్కు ఏవిధంగానైనా సాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.
ఇదీ చదవండి : మహిళలూ.. అది ఫేక్న్యూస్!