ప్రపంచదేశాలకు పెను సవాల్గా మారిన కొవిడ్-19.. పాక్ ఉగ్రవాదులకు వరంలా మారింది. ఖైదీలకు వైరస్ ముప్పు పొంచిఉందనే కారణంగా ఇప్పటికే లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ సహా అనేక మంది ఉగ్రవాదులకు విముక్తి కల్పించింది. లాహోర్లో ఉన్న 50 మంది ఖైదీలకు వైరస్ సోకిందని ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. ఈ సాకుతో ప్రమాదకర ఉగ్రవాదులందరికీ దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు.
పాక్ బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల్లో అక్కడి ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. పాకిస్థాన్ను బ్లాక్ లిస్ట్ జాబితాలో చేర్చాలా? వద్దా.? అనే అంశంపై వచ్చే నెలలో ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సుమారు 1000 మంది ముష్కరుల్ని అధికారిక జాబితా నుంచి పాక్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తొలగించింది.
అయినా మారని పాక్ బుద్ధి..
ఓవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధితో కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పురిగొల్పుతోంది. గత రెండు నెలల నుంచి కశ్మీర్ సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా మోర్టార్లతో దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. సాధారణ ప్రజలు జవాన్ల ప్రాణాలు బలిగొంటోంది. కరోనా రోగులను సరిహద్దు గుండా పంపి వైరస్ వ్యాప్తికి కుట్ర పన్నుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'కరోనాపై పోరుకు ఐకమత్యమే మహా బలం'