పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిర్వహణ ఖర్చులను వీలైనంతమేరకు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక వ్వవస్థను చక్కబెట్టేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఇప్పటికే 6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. తన మిత్ర దేశాలైన చైనా, యూఏఈ సౌదీ నుంచి ప్యాకేజీని సైతం అందుకుంది.
అర్థిక వ్యవస్థ అంతంత్ర మాత్రంగానే ఉండగా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీతం రూ.2.01లక్షల నుంచి రూ.8లక్షల వరకు పెరిగినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు రావడం చర్చనీయాంశమైంది. అనంతరం ఆ వార్తలు నిరాధారమైనవని ఇమ్రాన్ కార్యాలయం స్పష్టం చేయగా చర్చకు తెరపడింది.
"ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని ప్రచారం చేస్తున్న సమయంలో ఇటువంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం దురదృష్టకరం"
-ప్రధాని కార్యాలయ ప్రతినిధి
ప్రధాన మంత్రి అధికారిక నివాస నిర్వహణ ఖర్చులను తగ్గించినట్లు, తన సొంతింటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు ఇమ్రాన్ఖాన్. ఇంటి నిర్వహణ వ్యయాన్ని తానే భరిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్వవస్థపై భారం పడనీయకుండా ఉండేందుకు ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన విరాళాలతోనే ఇటీవల స్విట్జర్లాండ్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లినట్లు చెప్పారు పాక్ ప్రధాని.