ఓ దేశ ప్రధానమంత్రి రెస్టారెంట్కు వెళ్లి, అక్కడ ఖాళీ లేక తిరిగి వెళ్లిపోయిన ఘటన గురించి మీరెప్పుడైన విన్నారా? కనీసం అలా జరుగుతుందని కలగన్నారా? కానీ అదే జరిగింది.
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం లాక్డౌన్ నిబంధనలు అమలు చేసిన న్యూజిలాండ్... తరువాత కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులు అమల్లోకి వచ్చిన రెండు రోజుల తరువాత ప్రధాని జెసిండా ఆర్డెర్న్, ఆమె కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్... వెల్లింగ్టన్లోని ఆలివ్ అనే రెస్టారెంట్కు వెళ్లారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల రెస్టారెంట్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో చేసేది లేక జెసిండా, ఆమె స్నేహితుడు క్లార్క్ తిరిగివెళ్లిపోయారు.
రెస్టారెంట్ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధిని ప్రశ్నించినప్పుడు... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరైనా భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని జెసిండా కూడా అదే పని చేశారని ఆయన పేర్కొన్నారు.
మినహాయింపులు లేవు..
న్యూజిలాండ్లో లాక్డౌన్ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చినా.. భౌతిక దూరం నియమాలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటరు(మూడు అడుగులు) దూరం ఉండాలి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు తమ సీటింగ్ను పరిమితం చేశాయి.
ట్విట్టర్లో ముచ్చట్లు...
ఈ విషయం ట్విట్టర్లో హాట్టాపిక్గా మారింది.
జోయి: ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఆలివ్ రెస్టారెంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు.
దీనిపై గేఫోర్డ్ స్పందించారు.
క్లార్క్ గేఫోర్డ్: జరిగిన దానికి నాదే బాధ్యత. నేను సరిగ్గా ప్రణాళిక వేసుకోలేదు. మా సీట్లను బుక్ చేసుకోలేదు. అయితే మేము వెనుదిరిగుతున్నప్పుడు.. ఖాళీ ఉందని హొటల్ సిబ్బంది మా వెంటపడటం ఎంతో బాగుంది.
సర్వత్రా ప్రశంసలు..
కరోనా విజృంభణ తరువాత జెసిండా... చాలా వేగంగా ప్రతిస్పందించి లాక్డౌన్ విధించారు. దానిని కఠినంగా అమలుచేసి వైరస్ వ్యాప్తిని బాగానే నియంత్రించగలిగారు. దీనితో ఆమెపై ప్రశంసలు కురిశాయి. గత ఐదురోజుల్లో అక్కడ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 1,498 కేసులు నమోదుకాగా.. 21 మంది మరణించారు.
ఇదీ చూడండి: వేశ్యగృహాలు మూసేస్తే 72% కరోనా కేసులు తగ్గినట్లే!