పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. 69 ఏళ్ల షరీఫ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. షరీఫ్ అభ్యర్థన మేరకు.. వైద్య చికిత్స కోసం సుప్రీం కోర్టు ఆరు వారాల బెయిల్ మంజూరు చేసింది. వైద్యం స్వదేశంలోనే పొందాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసిఫ్ సయీద్ ఖోసా అధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం షరీఫ్ పిటిషన్ను పరిశీలించింది. షరీఫ్కు అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉన్న రిత్యా చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దేశం లోపలే చికిత్స పొందడానికి వీలు కల్పిస్తూ న్యాయస్థానం 6 వారాల బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ నుంచి విదేశాలకు వెళ్లకుండా షరీఫ్పై నిషేధం ఉంది.
రెండు బెయిల్ బాండ్లు ఒక్కోటి 5 మిలియన్ పాకిస్థాన్ రూపాయలు చొప్పున డిపాజిట్ చేయాలని సుప్రీం ఆదేశించింది.సరైన పత్రాలు సమర్పించడంలో జాప్యంతో అతని విడుదల పది గంటలు ఆలస్యమైంది. అనంతరం పాక్ మాజీ ప్రధాని బయటకు రాగానే.. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వారి అనుచరులు నినాదాలు చేశారు.
నిర్లక్ష్యం చేస్తున్నారు..
పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎమ్ఎల్-ఎన్) అధినేత నవాజ్కు, ఇటీవల కాలంలోనే నాలుగు సార్లు గుండె పోటు వచ్చిందని, అతని కుమార్తె మరియం నవాజ్ తెలిపారు. అయినా ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం.. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్కు సరైన విద్య చికిత్స అందించడం లేదని ఆమె ఆరోపించారు.
పలు అవినీతి కేసుల్లో నిందితుడు..
నవాజ్ షరీఫ్పై పలు అవినీతి కేసులు ఉన్నాయి. అవెన్ఫీల్డ్ ప్రాపర్టీస్-లండన్లో అక్రమాస్తులు కేసు, ఫ్లాగ్షిప్ పెట్టుబడులు, అల్ అజీజియా స్టీల్ మిల్స్ సంబంధిత కేసులు అతనిపై ఉన్నాయి.
అల్ అజీజియా స్టీల్ మిల్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2018 డిసెంబర్ నుంచి మూడు నెలలుగా లాహోర్లోని 'కోట్ లఖ్పత్' జైలులో ఉంటున్నారు.
ఇదీ చూడండి :నీరవ్ కోసం లండన్కు సీబీఐ-ఈడీ బృందం