డ్రాగన్ పాలకులకు హితవు చెప్పబోయి, వారి ఆగ్రహానికి గురైన ఆన్లైన్ వాణిజ్య దిగ్గజం జాక్ మా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు అనేక కథనాలు వెలువడ్డాయి. మూడు నెలల అనంతరం కూడా ఆయన ఎక్కడ ఉన్నారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఈ చైనా కుబేరుడు సింగపూర్కు పారిపోయారని, గృహనిర్బంధంలో ఉన్నారని, కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఊహాగానాలకు తాత్కాలికంగా తెరదించుతూ ఆయన ఓ ద్వీపంలోని గోల్ఫ్ మైదానంలో కనిపించారని తెలుస్తోంది.
అలీబాబా, యాంట్ గ్రూప్ల వ్యవస్థాపకుడు జాక్ మా ఉన్నారంటున్న ప్రదేశం.. చైనాకు చెందిన హైనాన్ ద్వీపంలో ఉంది. అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన ఇక్కడి సన్ వ్యాలీలో జాక్ మా తన సమయాన్ని గడుపుతున్నట్టు ఆంగ్ల మీడియా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఓ వ్యాపార సమావేశం సందర్భంగా.. తాను సోమవారం జాక్తో సంభాషించానని ఆయన చిరకాల స్నేహితుడు, సాఫ్ట్ బ్యాంకు వ్యవస్థాపకుడు మసాయోషీ సన్ తెలిపారు. దీనితో జాక్ మా నిర్బంధంలో ఉన్నారన్న వార్తలు నిజంకాదని తెలిసింది.
ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం గ్రామీణ ఉపాధ్యాయులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్లో జాక్ మా పాల్గొన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కొవిడ్ అంతమైన తర్వాత మనమంతా మళ్లీ కలుద్దామని గతంలో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పనిచేసిన మా ఈ సందర్భంగా వెల్లడించారట. ఐతే అలీ బాబా, యాంట్, సన్ వ్యాలీ రిసార్ట్ ప్రతినిధులు జాక్ మా ఎక్కడున్నారన్న విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.