భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్.. మరోమారు తన బుకాయింపు వైఖరి ప్రదర్శించింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరం పునరుద్ధరణపై బిపిన్ రావత్ వ్యాఖ్యలను పాక్ విదేశాంగ శాఖ ఖండించింది. భారత సైన్యాధ్యక్షుడి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.
బిపిన్ రావత్ సోమవారం చెన్నైలో... 'పాకిస్థాన్ ఇటీవలే బాలాకోట్ ఉగ్రవాద శిబిరాన్ని పునరుద్ధరించింది. సుమారు 500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబాడడానికి సిద్ధంగా ఉన్నారు' అని వ్యాఖ్యానించారు. పాక్ దుశ్చర్యలకు ఈసారి భారత్ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
బిపిన్ రావత్ వ్యాఖ్యలు ఖండించిన పాక్... జమ్ము కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలు సఫలం కాబోవని వ్యాఖ్యానించింది.
జైషే దాడికి ప్రతీకారం
జమ్ము కశ్మీర్ పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ప్రతీకారంగా భారత వాయుసేన... పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది.
ఇదీ చూడండి: 'సోషల్ మీడియా నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు'