కరోనా వైరస్ మృత్యు పంజా విసురుతూనే ఉంది. చైనాలో శుక్రవారం ఒక్క రోజే 86 మంది చనిపోయారు. వీరిలో హుబే రాష్ట్రంలోనే 81 మంది ఉన్నారు. కరోనా కారణంగా చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 723కు చేరింది.
ఇద్దరు విదేశీయులకు
తొలిసారిగా ఇద్దరు చైనాయేతరులు కూడా కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. వీరిలో 60ఏళ్ల అమెరికా మహిళ, మరో జపాన్ వ్యక్తి ఉన్నారు. చైనాలో మొత్తం 16 మంది విదేశీయులకు కరోనా వైరస్ సోకగా, వీరిలో ఇద్దరు కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది.
11 వేల మంది వైద్యుల బృందం...
చైనాలో కొత్తగా 3 వేల 399 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 34 వేల 546కు చేరింది. కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం దాన్ని కట్టడి చేసే చర్యలను మరింత ముమ్మరం చేసింది. వైరస్కు కేంద్రంగా ఉన్న వుహాన్కు 11వేల మందితో వైద్య బృందాన్ని పంపింది. వీరిలో దేశంలోనే అత్యుత్తమమైన అత్యవసర చికిత్సా విభాగం సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 3వేల మంది వైద్యులు కూడా ఇందులో ఉన్నారు.
మరో ఆసుపత్రి...
కరోనా పీడితులకు చికిత్స అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన కొత్త ఆసుపత్రులను నిర్మిస్తున్న చైనా ప్రభుత్వం మరో ఆసుపత్రిని శనివారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. వుహాన్లో 1500 పడకలతో లైషెన్షాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో శనివారం నుంచి రోగులను చేర్చుకుంటూ చికిత్స అందిస్తున్నారు. ఇందులో 32 వార్డులు, ఒక సర్జికల్ ఆపరేటింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం కూడా వెయ్యి పడకలతో నిర్మించిన ఆస్పత్రిని చైనా అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఇతర దేశాల్లోనూ...
ఇతర దేశాల్లోనూ కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. హాంకాంగ్లో 26 మందికి వ్యాధి సోకగా ఒకరు మరణించారు. తైవాన్లో 16 మందిలో కరోనా వ్యాధి లక్షణాలు బయటపడగా, మకావులో 10 మందికి సోకినట్లు తేలింది. ఫ్రాన్స్లో ఓ చిన్నారి సహా అయిదుగురు బ్రిటన్ దేశస్తుల్లో కరోనా వైరస్ బయటపడింది. దీంతో ఫ్రాన్స్లో కరోనా వైరస్ బయటపడ్డ వారి సంఖ్య 16కు చేరింది.
వారికి కరోనా సోకలేదు...
చైనాలోని హుబేలో చిక్కుకుని శుక్రవారం రాత్రి కేరళకు చేరుకున్న ఆ రాష్ట్రానికి చేరుకున్న 15 మంది విద్యార్థులను వారి ఇళ్లకు వెళ్లేందుకు వైద్యులు అనుమతిచ్చారు. కొచ్చిలోని కలామసెర్రీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారికి కరోనా లక్షణాలు లేవని తేల్చాక ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- రేపు 121 ఇళ్ల పంపిణీ