కరెన్సీ మ్యానిప్యులేటర్గా ముద్ర పడిన చైనా మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. మార్కెట్కు అనుగుణంగా తన కరెన్సీ మారకపు విలువను మార్చే ప్రయత్నం చేస్తోంది. పెరుగుతున్న కరెన్సీ ఎక్స్ఛేంజీ రేటును నియంత్రించేందుకు చైనా సెంట్రల్ బ్యాంకు ప్రయత్నిస్తోంది. పటిష్ఠ నియంత్రణలో ఉన్న యువాన్ రేటును మార్కెట్ ఆధారితంగా, సరళతరం చేయనున్నట్లు తెలిపింది.
మే నెలలో చైనా యువాన్ విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 12 శాతం పెరిగి... నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఒక్కో యూఎస్ డాలరుకు మారకం విలువ 6.3674 యువాన్లుగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(చైనా సెంట్రల్ బ్యాంకు) ఆ దేశ బ్యాంకులు, రుణాలు అందించే సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీలైనంతగా విదేశీ ద్రవ్యాన్ని అట్టిపెట్టుకోవాలని సూచించింది. సెంట్రల్ బ్యాంకుల వద్ద ఇతర బ్యాంకులు ఉంచే విదేశీ కరెన్సీ నిల్వలు 5 శాతం నుంచి 7శాతానికి పెంచింది. 2007 తర్వాత తొలిసారి ఈ పరిమితిని పెంచింది. ఈ మార్పు ద్వారా ఒక ట్రిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీలో 20 బిలియన్ డాలర్లు రిజర్వు బ్యాంక్ వద్ద పేరుకుపోతాయి.
కరెన్సీ విలువ మారితే?
కరెన్సీ విలువ మార్పులు వర్తకం, ఎగుమతులు- దిగుమతులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు డాలర్ విలువ బలంగా ఉంటే.. అమెరికన్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ ఆ దేశ వస్తువులు ఇతర దేశాల్లో ఎక్కువ ధర పలుకుతాయి.
ఒకవేళ డాలర్ బలహీన పడితే... అమెరికా వస్తువులు విదేశాలకు చౌకగా దొరుకుతాయి. తద్వారా ఎగుమతులు పెరుగుతాయి. కానీ, ఇతర దేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేయాలంటే అమెరికా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా దిగుమతులపై ప్రభావం పడుతుంది.
చైనా- కరెన్సీ మ్యానిప్యులేటర్
పరిస్థితులకు అనుగుణంగా తన కరెన్సీ రేటు మార్చుకుంటుందని చైనాపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. అంతేకాక, ఆయన హయాంలో అధికారికంగా చైనాపై 'కరెన్సీ మ్యానిప్యులేటర్' ముద్ర వేశారు.
కరెన్సీ విలువ వేగంగా పెరగడం పట్ల చైనా పాలకులు ఆందోళనలో ఉన్నారని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ 'మక్వారీ' పేర్కొంది. చైనా యువాన్ విలువ ఇలాగే కొనసాగితే తమ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలుకుతాయని, తద్వారా తయారీ రంగంపై ప్రభావం పడుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి-