కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా ఆ మహమ్మారి మళ్లీ తమ దరికి చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఎవరెస్టునూ కరోనా తాకగా.. ఆ పర్వతం ఉత్తరవాలు తమ దేశంలో ఉండటంతో పర్వతారోహకులకు కఠిన నిబంధనలు చైనా అమలు చేస్తోంది. నేపాల్ నుంచి ఎవరెస్టును అధిరోహించే కరోనా సోకిన పర్వతారోహకులు తమవైపు రాకుండా ఒక ప్రత్యేక గీతను గీస్తోంది. నేపాల్ నుంచి ఎక్కేవారు, టిబెట్ నుంచి అధిరోహించే వారు కలవకుండా కఠిన చర్యలు చేపట్టింది.
ఇప్పటి వరకు నేపాల్లోని ఎవరెస్ట్ బేస్క్యాంప్లో ఉన్న 30 మంది పర్వతారోహకులు కరోనా బారిన పడ్డారు. ఎవరెస్ట్ నేపాల్లో ఉన్నా.. దాని ఉత్తర భాగం మాత్రం చైనా ఆధీనంలో ఉంది. ఆ వైపు నుంచి కూడా పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు.
తమ వైపు వారికి వైరస్ సోకకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు చైనా అధికార మీడియా వెల్లడించింది. ఎవరెస్ట్పై ప్రత్యేకంగా ఓ లైన్ ఏర్పాటు చేస్తోంది చైనా. తమ వైపు నుంచి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన వాళ్లు ఆ లైన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర, దక్షిణ వైపు నుంచి ఎక్కే క్లైంబర్స్ కలవకుండా తాము అత్యంత కఠినమైన వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు టిబెట్ అధికారులు వెల్లడించారు.
ఎవరెస్ట్ శిఖరంపై ప్రత్యేక గీతను గీసే అంశంపై నేపాల్ ప్రభుత్వం, పర్వతారోహణ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
సాధారణ టూరిస్టులపై నిషేధం..
ఈ ఏడాది ఎవరెస్ట్ ఎక్కడానికి 21 మందికి చైనా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ నుంచే వీళ్లంతా టిబెట్లో క్వారంటైన్లో ఉన్నారు. తమ వైపు ఉన్న ఎవరెస్ట్ సమీపంలో వైరస్ లేకుండా చూడటానికి సాధారణ టూరిస్టులను చైనా ఇప్పటికే నిషేధించింది. గతేడాది నుంచి కరోనా కారణంగా విదేశీ క్లైంబర్స్ను కూడా అనుమతించడం లేదు. కేవలం తమ దేశ పర్వతారోహకులకే అనుమతి ఇచ్చింది.
నేపాల్లో అనుమతి..
నేపాల్ కూడా గతేడాది ఇలాగే చేసినా.. పర్యాటకాన్ని మళ్లీ గాడిలో పడేసేందుకు ఈసారి విదేశీ టూరిస్టులను కూడా అనుమతించింది. ఎవరెస్ట్ ఎక్కడానికి అనుమతి కోసమే నేపాల్ ప్రభుత్వానికి 11 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత తమ సాహసయాత్ర పూర్తి చేయడానికి మరో 40 వేల డాలర్లు ఖర్చు అవుతుంది.
ఇదీ చూడండి: ఎవరెస్టు పర్వతాన్నీ వదలని కరోనా!