ప్రమాదకరమైన జీవ ఆయుధాలను తయారుచేసేందుకు పాకిస్థాన్, చైనాలు ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఆంత్రాక్స్కు సంబంధించిన పరిశోధన ప్రాజెక్టులనూ ఆ రెండు దేశాలు చేపట్టాయని తెలిపింది. అయితే ఈ వార్తలను పాకిస్థాన్ కొట్టిపడేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కథనమని పేర్కొంది.
పరిశోధనాత్మక దినపత్రిక 'ద క్లాక్సన్' ఈ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్కు చెందిన సైనిక రక్షణ శాస్త్ర, సాంకేతిక సంస్థ (డెస్టో)తో చైనాకు చెందిన వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని అందులో పేర్కొంది. 'కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధుల'పై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ఉద్దేశమని తెలిపింది.