మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అధికార పార్టీ నేతలను దిగ్బంధించిన సైన్యం... తన చర్యలను సమర్థించుకునేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ అగ్రనేత, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించడానికి కారణంగా చూపుతూ ఓ సరికొత్త కేసును తెరపైకి తీసుకొచ్చింది. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు కలిగి ఉన్నారని ఆమెపై కేసు బనాయించింది.
ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారని మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్పైనా సైన్యం కేసు పెట్టింది. తద్వారా ఇద్దరు అగ్రనేతలను కనీసం ఫిబ్రవరి 15వరకు నిర్బంధంలోనే ఉంచేందుకు న్యాయపరంగా మార్గం సుగమం చేసుకుంది.
చైనా తీరే వేరు!
మయన్మార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తుంటే... చైనా మాత్రం భిన్నంగా స్పందించింది. సైనిక చర్యను ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం చేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజం చేపట్టే చర్యలు మయన్మార్లో ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉండకూడదని వ్యాఖ్యానించింది చైనా.