పాకిస్థాన్లో హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఓ అతివాద ఇస్లాం పార్టీకి చెందిన వ్యక్తులుగా పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో రాడికల్ జమైత్ ఉలేమా ఈ ఇస్లాం పార్టీ నాయకుడు రెహమత్ సలాం ఖట్టక్ ఉన్నట్లు తెలిపారు. 350 మందిని ప్రాథమిక దర్యాప్తు నివేదిక(ఎఫ్ఐఆర్)లో చేర్చినట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని కరాక్ జిల్లాలో హిందూ దేవాలయాన్ని ఓ అల్లరిమూక కూల్చివేస పక్కనే నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్నీ ధ్వంసం చేసింది. సుమారు వెయ్యి మందికి పైగా స్థానికులు మందిరం తొలగించాలని నిరసనలు చేపట్టినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. ముందుగా దేవాలయం బయట పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వారు.. చివరకు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
భిన్న వాదనలు
ఈ చారిత్రక కట్టడాన్ని 1920కి ముందు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మందిరాన్ని కూల్చివేసే సమయంలో నిర్మాణంలో ఉన్న మరో భవంతిని కూడా పడగొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ ఆందోళనలను పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. అయితే దీనిపై పోలీసుల వివరణ మరోలా ఉంది. దేవాలయ నిర్వాహకులు రహస్యంగా మందిర విస్తరణ పనులు చేపట్టారని, అందుకే స్థానికులు ఆందోళనకు దిగారని చెప్పారు.
ఇదీ చూడండి: పాక్లో హిందూ ఆలయాన్ని కూల్చిన అల్లరిమూక