పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రం క్వెట్టా నగరంలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు చేసేవారే లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో మత గురువు, ఓ సీనియర్ పోలీసు అధికారి సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్వేట్టా ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో బాంబ్ పేలడం ఇదీ రెండోసారి.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు భద్రతా సిబ్బంది. ఘటనా స్థలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతంలోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి విధించారు.
మరణించిన వారిలో డీఎస్పీ ఓమనుల్లాహ్ ఉన్నట్లు డీఐజీ తెలిపారు. పోలీసు అధికారి లక్ష్యంగా దాడులు చేసినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. గత నెలలో డీఎస్పీ కుమారుడిని అపహరించి హతమార్చినట్లు వివరించారు.
బలూచిస్థాన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ముష్కరులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రులు. బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు.
ఇదీ చూడండి:ఆడపిల్ల జోలికెళితే.. 'కాల్'చేస్తున్న లిప్స్టిక్