అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దక్షిణాసియాలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లకు వెళ్లాలనుకునే తమ పౌరులకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పాక్కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచన చేయాలని సూచించింది. కరోనా పరిస్థితులతో పాటు పాక్లో ఉగ్రవాదం, విభజనవాదుల హింస ఎక్కువగా ఉండడమే అందుకు కారణంగా పేర్కొంది.
ఒకవేళ పాక్ వెళ్లినా.. ఆ దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుల్లో మాత్రం అసలు తిరగొద్దని, అక్కడ ఉగ్రవాదంతో పాటు అపహరణ ముఠాల ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించింది. అక్కడ ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయని పేర్కొంది. నియంత్రణ రేఖకు ఇరువైపులా భారత్, పాక్ల సైనిక బలగాలు భారీ సంఖ్యలో మోహరించి ఉంటాయని, వాటి మధ్య తరచూ ఎదురు కాల్పులు చోటుచేసుకుంటూ ఉంటాయని తెలిపింది.
బంగ్లాదేశ్లో నేరాలు, ఉగ్రవాదం, అపహరణల ముప్పు దృష్ట్యా అక్కడికి వెళ్లినప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది.
అఫ్గాన్లో అపహరణ ముఠాలు, ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాదంతో అశాంతి నెలకొని ఉందని, అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంది.
నెగటివ్ నివేదిక చూపిస్తేనే అమెరికాకు
కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికాకు వచ్చే విదేశీ ప్రయాణికులకూ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ప్రయాణానికి ముందు మూడు రోజుల్లోపు వారు కరోనా నెగటివ్ నివేదికను విమానయాన సంస్థలకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు.
జనవరి 26 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. ఐరోపా దేశాలతో పాటు బ్రిటన్, బ్రెజిల్, ఐర్లాండ్ దేశాల ప్రయాణికులు అమెరికాలోకి రాకుండా మళ్లీ ఆంక్షల్ని విధిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ బృందం సలహా మేరకే బైడెన్ ఈ చర్యలు చేపట్టినట్లు జెన్ సాకీ తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొత్త వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆ దేశ ప్రయాణికులపైనా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ట్రంప్ అభిశంసనపై విచారణ- నిర్దోషిగా తేలే అవకాశం!