పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్పై నూతన ఆంక్షలు విధించింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడమే ఇందుకు కారణం.
అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ఇరాన్పై విధించిన ఈ నూతన ఆంక్షల గురించి ప్రకటించారు. జనరల్ సులేమానీని హతమార్చినందుకు ప్రతీకారంగా యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడిచేయడాన్ని ఆయన ఖండించారు. ఈ దాడికి కారణమైన, పశ్చిమాసియాను అస్థిరపరిచే కార్యకలాపాలకు పాల్పడుతున్న 8 మంది ఇరాన్ అత్యున్నత అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
నిషేధాజ్ఞలు
ఇరాన్తో జౌళి, నిర్మాణ, ఉత్పత్తి, గనుల రంగాల్లో ఎవరూ సంబంధాలు ఏర్పరుచుకోకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారని అమెరికా ఖజానా విభాగ కార్యదర్శి స్టీవెన్ తెలిపారు. ఉక్కు, ఇనుము తదితర రంగాలకు సంబంధించి విడిగా ఆంక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ఇరాన్కు అందిస్తున్న బిలియన్ల డాలర్ల సహాయాన్ని తగ్గిస్తున్నామని ఆయన వెల్లడించారు.
తీవ్ర ఉద్రిక్తతలు
జనరల్ సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసింది. అయితే తదుపరి పరిణామాల్లో ఉద్రిక్తతలు కొంత తగ్గినా... పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
ఇదీ చూడండి: బ్రిటన్ రాజకుటుంబంలో సంక్షోభం.. కెనడాకు మేఘన్!