నల్ల జాతీయుడు జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పులతో హింసాత్మక ఘటనలు చెలరేగిన విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషాలో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అల్లర్లలో ధ్వంసమైన దుకాణాలు, ఇళ్లను సందర్శించి, యజమానులతో మాట్లాడారు. ఈ అల్లర్లు డెమొక్రటిక్ నేతలే ప్రారంభించారని ఆరోపించారు ట్రంప్.
ట్రంప్ పర్యటనపై రాష్ట్ర, స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కెనోషాలో పర్యటించారు ట్రంప్. స్థానిక డెమొక్రటిక్ పాలకులపై విమర్శలు గుప్పించారు. 'నేను ఇక్కడికి వచ్చేందుకు వారికి ఇష్టం లేదు. ఫెడరల్ బలగాలను మోహరించేందుకు ఈ గవర్నర్లకు, మేయర్లకు ఇష్టం లేదు. బలగాలను పంపమని వారు అడగాలి. కానీ అలా చేయలేదు' అని పేర్కొన్నారు ట్రంప్.
భారీ భద్రత..
ట్రంప్ కాన్వాయ్ వెళుతున్న క్రమంలో కొద్దరు మద్దతుదారులు అమెరికా జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడి పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసు కమాండ్ పోస్ట్గా మార్చిన పాఠశాలను సందర్శించారు ట్రంప్. భద్రత బలగాలను ప్రశంసించారు. అయితే.. హింసకాండకు అసలు కారణంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ట్రంప్. బ్లేక్ విషయాన్ని మొదటగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అతని తల్లిని కలవాలనుకున్నానని, కాని వారి కుటుంబం నిరాకరించినందున విరమించుకున్నట్లు చెప్పారు.
తన విమర్శల దాడిని కొనసాగిస్తూ.. విధ్వంసకాండను డెమొక్రటిక్ పార్టీ, వారి అధ్యక్ష అభ్యర్థి జో బైడన్కు ఆపాదించారు ట్రంప్. ఈ గందరగోళ పరిస్థితులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.
పునర్నిర్మాణానికి సాయం..
సమాజ భద్రతపై కెనోషాలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి హాజరయ్యారు ట్రంప్. హింసను కట్టడి చేసేందుకు కెనోషాకు వేగంగా నేషనల్ గార్డ్స్ను పంపేందుకు రాష్ట్ర అధికారులతో తమ పరిపాలన విభాగం సమన్వయమైనట్లు చెప్పారు. ఏ నగరానికైనా వేగంగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కెనోషా పునర్నిర్మాణానికి హామీ ఇచ్చారు ట్రంప్. చిరు వ్యాపారాలకు 4 మిలియన్ డాలర్లు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా భద్రతకు 42 మిలియన్ డాలర్లు, కెనోషా పోలీసు విభాగానికి 1 మిలియన్ డాలర్లు అందిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: 'జాకబ్' నిరసనల్లో కాల్పులు- ఇద్దరు మృతి