మూడు దశాబ్దాల కాలంలో జార్జియాను గెలుచుకున్న తొలి డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా నిలిపినందుకు అక్కడి ఓటర్లకు జో బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. సెనేట్ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలను అందించాలని కోరారు. అట్లాంటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ఈ ఒక్క రాష్ట్రం.. తర్వాతి తరాన్ని మార్చగలదని అభిప్రాయపడ్డారు. కరోనాతో పోరాడేందుకు సెనేట్లో మెజారిటీ కావాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్ల లక్ష్యంగా విమర్శలు చేశారు.
"ఇది నూతన సంవత్సరం. రేపు అట్లాంటాకు, జార్జియాకు, అమెరికాకు సరికొత్త రోజు కావచ్చు. ఇప్పుడు మీకు ఇద్దరు సెనేటర్లు ఉన్నారు. వారు అమెరికా రాజ్యాంగానికి కాకుండా.. డొనాల్డ్ ట్రంప్కే ప్రమాణస్వీకారం చేసినట్టు కనిపిస్తోంది."
-జో బైడెన్, అమెరికా తదుపరి అధ్యక్షుడు
మరోవైపు, జార్జియాలోని మెగాచర్చ్లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాషింగ్టన్ను డెమొక్రాట్లు హస్తగతం చేసుకోకుండా ఆపేందుకు ఉన్న చివరి అవకాశం ఇదేనని పేర్కొన్నారు. జార్జియాను గెలుచుకొని, అమెరికాను కాపాడతామంటూ వ్యాఖ్యానించారు. నార్త్ జార్జియాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సైతం జరగాల్సి ఉంది.
ఈ ఎన్నిక కీలకం
సెనేట్లో మెజారిటీని నిలుపుకోవాలంటే రిపబ్లికన్లు జార్జియాలో ఒక్క స్థానం గెలిస్తే సరిపోతుంది. మరోవైపు, డెమొక్రట్లు రెండు సీట్లను గెలుచుకుంటే సభలో మెజారిటీ 50-50 స్థానాలకు చేరుతుంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సభాధ్యక్ష హోదాలో ప్రాధాన్య ఓటు వేస్తారు కాబట్టి.. సెనేట్ డెమొక్రాట్ల వశమవుతుంది. ఇప్పటికే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు మెజారిటీ ఉంది.
నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలోని 16 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ గెలుచుకున్నారు. పాపులర్ ఓట్లలో 12 వేల మెజారిటీ సాధించారు.
ఇదీ చదవండి: