భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని సిలికానాంధ్ర తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం జూమ్ వేదికగా.. లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ గొంతు కలిపి ఈ అద్భుత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గొప్ప విశేషమే కాకుండా సాంకేతికంగానూ మహత్కార్యమని నిర్వాహకులు తెలిపారు.
'హనుమంతుని శక్తి ప్రజలకు కావాలి'
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరికీ మనో బలంతో పాటు సామాజిక స్థైర్యం, శాంతి నెలకొనాలని వారి ఆశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్.. త్వరలోనే ఈ ప్రపంచం కరోనా నుంచి బయట పడాలని ఆకాంక్షించారు. హనుమంతుడికి బుద్ధి, బలం, పరాక్రమం కలగలసిన శక్తి ఉందని, అది ప్రజలందరికీ కావాలని ఆయన కోరారు.
కరోనాను జయించాలని..
ఈ కార్యక్రమం ద్వారా దైవ, మానవ శక్తి కలగలిసి మహా చైతన్యంగా ఏర్పడి.. కరోనాపై విజయం సాధించాలని సంస్థ సభ్యులు అభిలషించారు. సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావితరాలకి అందిస్తోందని, అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించడం విశేషమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు కొనియాడారు. రామ నామం స్మరించడం మంచిదని, అది రాళ్ళనైన తేలిక చేసి సముద్రంలో వారథినైనా నిర్మిస్తుందని వారు చెప్పారు. తద్వారా ప్రజా సమస్యల కోసం రాముడి నామం జపించి కరోనాని జయిద్దామని అన్నారు.
గిన్నిస్ రికార్డ్..
![One-Lakh-members-creates-Guinness-World-Records-by-singing-Hanuman-Chalisa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8443702_hanumanchalisa.jpg)
లక్ష మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో నిర్వహించిన ఈ బృహత్కార్యంలో సిలికానాంధ్ర సభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చామర్తి, మధుబాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతి చింతలపూడి, స్నేహ వేదుల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎల్లలు దాటిన 'స్వాతంత్ర్య' భారత సంబరం!