అమెరికాలో భారతీయ మూలాలున్న మరో మహిళకు కీలక పదవి లభించనుంది. వివిధ స్థాయిల్లోని న్యాయమూర్తుల పదవులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రతిపాదించిన పదిమందిలో రూపా రంగా పుట్టగుంట ఒకరు. ఆమెను డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా(డీసీ) జిల్లా కోర్టు న్యాయమూర్తి పదవికి నామినేట్ చేస్తున్నట్లు శ్వేత సౌధం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిపాదనకు సెనెట్ ఆమోదం కూడా లభిస్తే.. డీసీ జిల్లా కోర్టు జడ్జి పదవికి ఎంపికైన మొట్టమొదటి ఆసియా అమెరికన్ మహిళగా రూపా రంగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొంది.
న్యాయ సహాయకురాలిగా..
ప్రస్తుతం ఆమె రెంటల్ హౌసింగ్ కమిషను జడ్జిగా ఉన్నారు. 2013-19 వరకు న్యాయవాదిగా ఉంటూ క్రిమినల్ కేసులను వాదించారు. గృహహింసకు సంబంధించిన కేసుల్లో స్వచ్ఛంద న్యాయ సహాయాన్ని అందిస్తూ మంచి పేరు సంపాదించారు. రూపా రంగా న్యాయవాద వృత్తి ప్రారంభంలో (2008-10) డీసీ సుపీరియర్ కోర్టు జడ్జి విలియం జాక్సన్కు న్యాయ సహాయకురాలిగా ఉన్నారు. రూపా రంగా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారాన్ని శ్వేత సౌధం వెల్లడించనప్పటికీ ఆమె ఆహార్యం. పేరును బట్టి తెలుగు మూలాలున్న వ్యక్తిగా తెలుస్తోంది.
సమర్థులకు అవకాశాలు..
ఫెడరల్ సర్క్యూట్, జిల్లా కోర్టు జడ్జి పోస్టులకు పేర్లను ప్రతిపాదించడంలోనూ బైడెన్ పాలనా యంత్రాంగం ప్రత్యేకతను చాటుకుంది. విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వారికి, వృత్తి నైపుణ్యం గల సమర్థులకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో బైడెన్ నామినేట్ చేసిన వారిలో ముగ్గురు ఆఫ్రికన్-అమెరికన్ మహిళలు, ఒక ముస్లిం అమెరికన్ కూడా ఉన్నారు. జడ్జి జాహిద్ ఇన్ ఖురేషి పేరును సెనెట్ ఆమోదిస్తే అమెరికా చరిత్రలోనే తొలి ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా నిలిచిపోతారు. పాకిస్థాన్ మూలాలున్న జాహిద్ ప్రస్తుతం న్యూజెర్సీ జిల్లా కోర్టు జడ్జిగా ఉన్నారు.
ఇదీ చదవండి: 'ఏప్రిల్ 19నుంచి 90శాతం వయోజనులకు టీకా'