భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ముఖర్జీని గొప్పనేతగా అభివర్ణించారు. ప్రణబ్ దూరదృష్టి నాయకత్వం భారత్.. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు సాయపడిందని పేర్కొన్నారు. అదే అమెరికా-భారత్ దృఢమైన బందానికి పునాది వేసిందని గుర్తు చేసుకున్నారు.
''భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణ వార్తతో దిగ్ర్భాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, భారత ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి.''
- డొనాల్డ్ ట్రంప్,అమెరికా అధ్యక్షుడు
అంతకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సంతాపం ప్రకటించారు. ప్రణబ్ మృతిపట్ల అగ్రరాజ్యం విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒక పార్లమెంటేరియన్గా, కేబినెట్ మంత్రిగా, ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా భారత ప్రజల కోసం నిస్వార్థంగా పని చేశారని కొనియాడారు పాంపియో.
ఇదీ చూడండి: ప్రణబ్ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం