అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా పట్టణ సమీపంలోని మిడ్లాండ్ ప్రాంతంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు అధికారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని మట్టుబెట్టారు. ప్రస్తుతానికి సాయుధులైన ముష్కరులు ఎవరూ మిడ్లాండ్లో లేరని తెలిపారు.
టొయోటా వాహనంలో వచ్చిన దుండగుడు తొలుత యూఎస్ పోస్టల్ సర్వీస్ వ్యాన్ని దొంగిలించాడు. అనంతరం అదే వ్యాన్లో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల సమయంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మొదటగా ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానించారు. అయితే ఒక వ్యక్తి ఫైరింగ్ జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.
ట్రంప్ స్పందన
ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషాదం వ్యక్తం చేశారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు అందిచాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్బీఐతో పాటు ఇతర భద్రతాధికారులు ఈ ఫైరింగ్పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఈ ఘాతుకాన్ని ముర్ఖపు చర్యగా అభివర్ణించారు.