కొవిడ్-19 కారక సార్స్కోవ్2 వైరస్ యాంటీబాడీలను చిటికెలో తెలుసుకోవటానికి కార్నెగీ మెలన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని రూపొందించారు. కేవలం 10-12 సెకన్లలోనే యాంటీబాడీలను పసిగట్టటం దీని ప్రత్యేకత. అధునాతన నానోపార్టికల్ 3డీ ప్రింటింగ్ సాయంతో ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇది అతి చిన్న రక్తం చుక్కలోనూ (సుమారు 5 మైక్రోలీటర్లు) కరోనా వైరస్కు సంబంధించిన ఎస్1 ప్రొటీన్, రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ) యాంటీబాడీలను గుర్తిస్తుంది. ఆ వెంటనే స్మార్ట్ఫోన్కు ఫలితాలను పంపిస్తుంది.
ఇది యాంటీబాడీ పరీక్ష కోసమే కాదు, కొత్త టీకాలకు మనలో ఎంతవరకు రోగనిరోధక ప్రతిస్పందనలు పుట్టుకొచ్చాయన్నది గుర్తించటానికీ తోడ్పడగలదు. దీన్ని చేతిలోనే పట్టుకొని పరీక్ష చేయొచ్చు. విద్యుత్ రసాయన ప్రతిచర్య ఆధారంగా పనిచేస్తుంది. దీంతో అతి సూక్ష్మ బంగారం మైక్రోపిల్లర్ ఎలక్ట్రోడ్ల మీద పూసిన యాంటీజెన్లకు యాంటీబాడీలు అతుక్కుపోతాయి. మైక్రోపిల్లర్ల ప్రత్యేక అమరిక మూలంగా మరిన్ని ఎక్కువ ప్రోటీన్లు పోగుపడతాయి. దీంతో ఫలితాలు కచ్చితంగా, త్వరగా వెలువడతాయి. తప్పుడు ఫలితాలు చాలా చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు.
సాంక్రమిక జబ్బుల నివారణ, చికిత్సలో త్వరగా వ్యాధులను నిర్ధారించటం చాలా కీలకం. ఒక్క కొవిడ్-19కే కాదు.. ఎబోలా, హెచ్ఐవీ, జికా ఇన్ఫెక్షన్లలోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చని వివరిస్తున్నారు.