సూయిజ్ కెనాల్ సంక్షోభం ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ కెనాల్లో భారీ నౌక ఇరుక్కుపోవడం వల్ల ప్రపంచ వ్యాపారంపై ప్రభావం చూపెడుతోంది. ఇక్కడ ఇరువైపులా కలిపి నిత్యం 9.6 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు, చమురు, గ్యాస్ రవాణా అవుతుంటాయి. ఈ లెక్కన గంటకు సగటున 400 మిలియన్ డాలర్లు (రూ.2,896 కోట్లు) విలువైన సరుకులు తరలిస్తారు. ఇప్పట్లో ఆ నౌకను అక్కడి నుంచి కదపలేకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒక వైపు మట్టిలో కూరుకుపోవడం వల్ల అంత భారీ బరువున్న నౌకను కదల్చడం కష్టతరంగా మారింది. ఇప్పటికే ఇక్కడ వేచి ఉన్న 160 నౌకల్లో.. 41 భారీ ఓడలు, 24 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఒక రోజు ఆలస్యాన్ని తగ్గించాలంటే ఆ తర్వత రెండు రోజులు అదనంగా కృషి చేయాల్సి ఉంటుందని రవాణా రంగ నిపుణులు అలెన్ బేర్ పేర్కొన్నారు. దీంతో బడా షిప్పింగ్ కంపెనీలు సూయిజ్ కాల్వకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నాయి.
సిబ్బంది మొత్తం భారతీయులే..
ఎవర్ గివెన్ నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం భారతీయులే. వీరంతా సురక్షితంగానే ఉన్నారు. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక నౌకను లోడుతో సహా తిరిగి సూయిజ్ కాల్వలో సక్రమమైన మార్గంలో పెట్టడం దాదాపు అసాధ్యమని నిపుణలు చెబుతున్నారు. ఇక దీనిలో ఉన్న దాదాపు 20వేల కంటైనర్లను నౌక నుంచి దింపేసిన తర్వాత పడవను తేలిగ్గా సరైన మార్గంలోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. కాకపోతే ఈ నౌకన్ అన్లోడింగ్ చేయడానికి కొన్ని రోజుల నుంచి వారాల వరకూ పట్టవచ్చు. ఇక నౌక తిరిగి నీళ్లలో తేలేట్లు చేయాలంటే మాత్రం సుమారు 20వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాలని డచ్కు చెందిన నౌకాయాన నిపుణులు చెబుతున్నారు. అంటే 12 నుంచి 16 మీటర్ల లోతుకు తవ్వాల్సి ఉంటుంది.
కంటైనర్ల కొరత..
చమురు రవాణాలో కంటైనర్ నౌకలదే కీలక పాత్ర. ఈ నౌకలు నింపుకొన్న చమురును ఎంత వేగంగా గమ్యస్థానాలకు చేరిస్తే.. అంత వేగంగా చమురు రవాణా చేయవచ్చు. ఇప్పటికే చమురు నింపుకొన్న దాదాపు 16కుపైగా కంటైనర్ నౌకలు ఇక్కడ చిక్కుపోయాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరుగుతోంది. అంటే అవి చమురను అన్లోడ్ చేసేవరకూ చమురు రవాణాకు ఆ మేరకు నౌకల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో ఐరోపా దేశాలకు పెట్రోలియం ఉత్పతుల సరఫరా మందగించవచ్చు.
ఇదీ చదవండి : క్వాడ్ కూటమిని వ్యతిరేకిస్తున్నాం: చైనా