ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం హైదరాబాద్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ప్రముఖ నటి ఎల్.విజయలక్ష్మికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ వ్యాఖ్య అన్నారు.
"ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం ఎల్.విజయలక్ష్మికి అందించడం సంతోషం. శక పురుషుడి శత జయంతి వేడుకలు చేయడం సంతృప్తిగా ఉంది. విజయలక్ష్మి 100కి పైగా సినిమాలు చేస్తే అందులో దాదాపు 60 ఎన్టీఆర్తో చేశారు. తన నృత్యం, నటనతో ఆమె ఎంతో మందిని అలరించారు. నటన తరువాత సీఏ చేసి, వర్జీనియా వర్సిటీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. అవకాశాలు రాకపోతే సినిమా వాళ్లు ఒత్తిడికి లోనవడం సహజం. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి. కానీ, భావి తరాలకు విజయలక్ష్మి ఆదర్శం" అని అన్నారు.
ఇంత అభిమానంతో తనని పిలిచి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని ఎల్.విజయలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ను ఆరాధిస్తూ పెరిగానని, తన జీవితంలో మరింత ముందుకు వెళ్లానంటే అందుకు ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న విలువలే కారణమని తెలిపారు. నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఎన్టీఆర్తో కలిసి నటించే సమయంలో చాలా భయపడేదానినని అయితే, ఆయన మాత్రం చాలా సౌకర్యంగా చూసుకునేవారని ఎల్.విజయలక్ష్మి గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి: అందుకే హిందీలో రీమేక్ సినిమాలు హిట్ కావట్లేదా?