ETV Bharat / entertainment

ప్రమోషన్స్​లో నయా ట్రెండ్​.. టికెట్​ రేట్లే ప్రధానాస్త్రం

author img

By

Published : Jun 6, 2022, 6:41 AM IST

Updated : Jun 6, 2022, 8:37 AM IST

Theatre Ticket prices: కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కోలుకోవడం కోసం టికెట్​ ధరలను పెంచారు. కానీ ఆ వ్యూహం బెడసికొట్టింది. ఫలితంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇది గుర్తించిన నిర్మాతలు.. ధరల విషయంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వీక్షకుల్ని మళ్లీ హాళ్లకు రప్పించేందుకు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. మా సినిమా టికెట్‌ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముతున్నామంటూ మూవీ ప్రమోషన్స్​​ చేయడం ప్రారంభించారు.

Theatre Ticket prices
టికెట్​ రేట్లు

Theatre Ticket prices: ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం కోసం చిత్రబృందాలు ఎన్నెన్నో వ్యూహాలు పన్నుతుంటాయి. అవన్నీ ప్రచార కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపిస్తుంటాయి. పాటల విడుదల, వేడుకలు, హీరో హీరోయిన్లు ఆడిపాడటాలు, టూర్లు, కాంటెస్టులు... ఇలా బోలెడంత హంగామా సాగుతుంటుంది. ఆరంభంలో మా సినిమాలో కొత్త కథ ఉందని చెప్పడం మొదలుకొని... విడుదల తర్వాత అదనంగా కొన్ని సన్నివేశాల్ని, పాటల్ని కలపడం వరకు ప్రతిదీ ప్రేక్షకుడిని ఆకర్షించడం కోసమే. అదనంగా మరికొన్ని టికెట్లు తెగడం కోసమే. అయితే ఎప్పుడూ లేని రీతిలో కొన్ని రోజులుగా ఈ ప్రచార పర్వంలో టికెట్‌ ధరే ప్రధానాంశంగా మారడం విశేషం. సినిమా కథ, అందులోని ఆకర్షణల సంగతుల కంటే... 'మా సినిమా టికెట్‌ ధర ఇంతే..' అంటూ ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

తెలుగు చిత్రసీమలో కొన్ని నెలల కిందట వరకూ టికెట్‌ ధర పెరగాలన్నదే ప్రధాన డిమాండ్‌. కరోనా నుంచి పరిశ్రమ కోలుకోవాలంటే, థియేటర్ల మనుగడ కొనసాగాలంటే టికెట్‌ ధరని పెంచడం తప్ప మరొక మార్గం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి పరిశ్రమ వర్గాలు. ఆ డిమాండ్‌కి తగ్గట్టే ప్రభుత్వాల నుంచి అనుమతులు పొంది టికెట్‌ ధరల్ని పెంచుకున్నారు కొద్దిమంది నిర్మాతలు. అది ప్రేక్షకుడిపై ఎంత ప్రభావం చూపిస్తుందనే విషయం తెలియడానికి పరిశ్రమకి ఎంతో కాలం పట్టలేదు. ఆరంభంలో భారీ అంచనాలున్న ఒకట్రెండు సినిమాల్ని ఎక్కువ ధరకే టికెట్‌ కొని చూశారు. ఆ తర్వాత ప్రేక్షకుడు థియేటర్‌వైపు చూడటం మానేశాడు. 'అంత ధర పెట్టి టికెట్‌ కొనడం ఎందుకు? ఓటీటీలోనో, టెలివిజన్‌లోనో వచ్చినప్పుడు చూద్దాం' అన్నట్టుగా ప్రేక్షకుడి ధోరణి కనిపించింది. కొన్నాళ్లపాటు థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. టికెట్‌ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు సినిమా బాగుందనే టాక్‌ రాకపోయినప్పటికీ... కొందరు అడపాదడపా థియేటర్లకి వెళ్లి కాలక్షేపం చేసొచ్చేవారు. కానీ స్టార్‌ కథానాయకుడి సినిమా అయినా, అంతంతమాత్రమే ప్రేక్షకుల స్పందన కనిపించడంతో... ఇది టికెట్‌ ధరల భారం ప్రభావమే అని పరిశ్రమ గుర్తించింది. మేల్కొంది. మా సినిమా టికెట్‌ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముతున్నామంటూ నిర్మాతలు చెప్పుకోవడం మొదలైంది. ఇది ఇప్పుడు ప్రచారంలో ఓ కొత్త ట్రెండ్‌గా మారిపోయింది.

ఇప్పటికే విడుదలైన 'ఎఫ్‌3', 'మేజర్‌' చిత్రబృందాలు, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'పక్కా కమర్షియల్‌' బృందం ముందుగానే టికెట్‌ ధరల గురించి ప్రేక్షకులకు స్పష్టతనిచ్చాయి. అదంతా ప్రేక్షకుడిని ఎలాగైనా థియేటర్‌కి రప్పించాలనే ప్రయత్నంలో భాగమే. ఇదివరకు ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్‌కి వచ్చేవారు. పెరిగిన టికెట్‌ ధరల భారంతో ఆ పరిస్థితులు లేవు. ఈ మధ్య ఓ అగ్ర తార సినిమాకీ తొలి రోజు తొలి ఆట టికెట్లు సులభంగా దొరికాయంటే ప్రేక్షకుడు ఎంత నిరాసక్తంగా ఉన్నాడో అర్థమవుతుంది. ప్రేక్షకుడిని మళ్లీ మునుపటిలా ఉత్సాహంగా థియేటర్‌కి తీసుకు రావాలంటే టికెట్‌ ధరల్ని తగ్గించామనే సంకేతాల్ని పంపడమే మార్గమని నిర్మాతలు గుర్తించారు. అందుకే టికెట్‌ ధరల గురించి ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఓటీటీకి దూరం... థియేటర్లని మళ్లీ మునుపటిలా కళకళలాడించాలంటే ఓటీటీ వేదికలకీ కొంచెం దూరంగా ఉండాలనే అభిప్రాయానికొచ్చారు నిర్మాతలు. విడుదలైన రోజుల వ్యవధిలోనే సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొస్తే ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం కష్టమనే విషయాన్ని గుర్తించాయి పరిశ్రమ వర్గాలు. అందుకే మా సినిమా ఇప్పట్లో ఓటీటీల్లో విడుదల కాదంటూ ప్రచారం చేసుకుంటున్నాయి ఆయా సినిమా వర్గాలు. 'ఎఫ్‌3' బృందం అదే చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇటీవల 'పక్కా కమర్షియల్‌' సినిమా వేడుకలో ఓటీటీని దూరం పెట్టాల్సిందే అన్నారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్‌ మా సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదనీ చెప్పారు. వందల కోట్ల వ్యయంతో రూపొందిన సినిమాల మాటేమో కానీ... పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాలకి టికెట్‌ ధరలు అందుబాటులో ఉండాల్సిందే అనే విషయం చిత్రసీమకి స్పష్టంగా అర్థమైంది. ధరల విషయంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఇదీ చూడండి: బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు బెదిరింపులు.. చంపేస్తామని లేఖ

Theatre Ticket prices: ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం కోసం చిత్రబృందాలు ఎన్నెన్నో వ్యూహాలు పన్నుతుంటాయి. అవన్నీ ప్రచార కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపిస్తుంటాయి. పాటల విడుదల, వేడుకలు, హీరో హీరోయిన్లు ఆడిపాడటాలు, టూర్లు, కాంటెస్టులు... ఇలా బోలెడంత హంగామా సాగుతుంటుంది. ఆరంభంలో మా సినిమాలో కొత్త కథ ఉందని చెప్పడం మొదలుకొని... విడుదల తర్వాత అదనంగా కొన్ని సన్నివేశాల్ని, పాటల్ని కలపడం వరకు ప్రతిదీ ప్రేక్షకుడిని ఆకర్షించడం కోసమే. అదనంగా మరికొన్ని టికెట్లు తెగడం కోసమే. అయితే ఎప్పుడూ లేని రీతిలో కొన్ని రోజులుగా ఈ ప్రచార పర్వంలో టికెట్‌ ధరే ప్రధానాంశంగా మారడం విశేషం. సినిమా కథ, అందులోని ఆకర్షణల సంగతుల కంటే... 'మా సినిమా టికెట్‌ ధర ఇంతే..' అంటూ ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

తెలుగు చిత్రసీమలో కొన్ని నెలల కిందట వరకూ టికెట్‌ ధర పెరగాలన్నదే ప్రధాన డిమాండ్‌. కరోనా నుంచి పరిశ్రమ కోలుకోవాలంటే, థియేటర్ల మనుగడ కొనసాగాలంటే టికెట్‌ ధరని పెంచడం తప్ప మరొక మార్గం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి పరిశ్రమ వర్గాలు. ఆ డిమాండ్‌కి తగ్గట్టే ప్రభుత్వాల నుంచి అనుమతులు పొంది టికెట్‌ ధరల్ని పెంచుకున్నారు కొద్దిమంది నిర్మాతలు. అది ప్రేక్షకుడిపై ఎంత ప్రభావం చూపిస్తుందనే విషయం తెలియడానికి పరిశ్రమకి ఎంతో కాలం పట్టలేదు. ఆరంభంలో భారీ అంచనాలున్న ఒకట్రెండు సినిమాల్ని ఎక్కువ ధరకే టికెట్‌ కొని చూశారు. ఆ తర్వాత ప్రేక్షకుడు థియేటర్‌వైపు చూడటం మానేశాడు. 'అంత ధర పెట్టి టికెట్‌ కొనడం ఎందుకు? ఓటీటీలోనో, టెలివిజన్‌లోనో వచ్చినప్పుడు చూద్దాం' అన్నట్టుగా ప్రేక్షకుడి ధోరణి కనిపించింది. కొన్నాళ్లపాటు థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. టికెట్‌ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు సినిమా బాగుందనే టాక్‌ రాకపోయినప్పటికీ... కొందరు అడపాదడపా థియేటర్లకి వెళ్లి కాలక్షేపం చేసొచ్చేవారు. కానీ స్టార్‌ కథానాయకుడి సినిమా అయినా, అంతంతమాత్రమే ప్రేక్షకుల స్పందన కనిపించడంతో... ఇది టికెట్‌ ధరల భారం ప్రభావమే అని పరిశ్రమ గుర్తించింది. మేల్కొంది. మా సినిమా టికెట్‌ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముతున్నామంటూ నిర్మాతలు చెప్పుకోవడం మొదలైంది. ఇది ఇప్పుడు ప్రచారంలో ఓ కొత్త ట్రెండ్‌గా మారిపోయింది.

ఇప్పటికే విడుదలైన 'ఎఫ్‌3', 'మేజర్‌' చిత్రబృందాలు, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'పక్కా కమర్షియల్‌' బృందం ముందుగానే టికెట్‌ ధరల గురించి ప్రేక్షకులకు స్పష్టతనిచ్చాయి. అదంతా ప్రేక్షకుడిని ఎలాగైనా థియేటర్‌కి రప్పించాలనే ప్రయత్నంలో భాగమే. ఇదివరకు ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్‌కి వచ్చేవారు. పెరిగిన టికెట్‌ ధరల భారంతో ఆ పరిస్థితులు లేవు. ఈ మధ్య ఓ అగ్ర తార సినిమాకీ తొలి రోజు తొలి ఆట టికెట్లు సులభంగా దొరికాయంటే ప్రేక్షకుడు ఎంత నిరాసక్తంగా ఉన్నాడో అర్థమవుతుంది. ప్రేక్షకుడిని మళ్లీ మునుపటిలా ఉత్సాహంగా థియేటర్‌కి తీసుకు రావాలంటే టికెట్‌ ధరల్ని తగ్గించామనే సంకేతాల్ని పంపడమే మార్గమని నిర్మాతలు గుర్తించారు. అందుకే టికెట్‌ ధరల గురించి ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఓటీటీకి దూరం... థియేటర్లని మళ్లీ మునుపటిలా కళకళలాడించాలంటే ఓటీటీ వేదికలకీ కొంచెం దూరంగా ఉండాలనే అభిప్రాయానికొచ్చారు నిర్మాతలు. విడుదలైన రోజుల వ్యవధిలోనే సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొస్తే ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం కష్టమనే విషయాన్ని గుర్తించాయి పరిశ్రమ వర్గాలు. అందుకే మా సినిమా ఇప్పట్లో ఓటీటీల్లో విడుదల కాదంటూ ప్రచారం చేసుకుంటున్నాయి ఆయా సినిమా వర్గాలు. 'ఎఫ్‌3' బృందం అదే చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇటీవల 'పక్కా కమర్షియల్‌' సినిమా వేడుకలో ఓటీటీని దూరం పెట్టాల్సిందే అన్నారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్‌ మా సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదనీ చెప్పారు. వందల కోట్ల వ్యయంతో రూపొందిన సినిమాల మాటేమో కానీ... పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాలకి టికెట్‌ ధరలు అందుబాటులో ఉండాల్సిందే అనే విషయం చిత్రసీమకి స్పష్టంగా అర్థమైంది. ధరల విషయంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఇదీ చూడండి: బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు బెదిరింపులు.. చంపేస్తామని లేఖ

Last Updated : Jun 6, 2022, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.